మహిళలను వేధించేవారి బెండు తీస్తున్న షీ టీమ్స్! మొహర్రం, బోనాల్లో 478 మందిని పట్టుకున్న పోలీసులు

by Ramesh Naini |   (  Updated:2025-07-15 13:06:00  IST  )

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రత కోసం గత ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మహిళలను వేధించేవారి బెండు తీస్తున్న షీ టీమ్స్! మొహర్రం, బోనాల్లో 478 మందిని పట్టుకున్న పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మహిళల రక్షణ, భద్రత కోసం గత ప్రభుత్వం (SHE Teams) షీ టీమ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు మహిళలను వేధించేవారి బెండు తీస్తోంది షీ టీమ్స్. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మహిళలపై ఈవ్‌టీజింగ్ పాల్పడే ఆకతాయిలపై గస్తీ కాస్తూ.. షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా మొహర్రం (Moharam), బోనాల (Bonalu festival) పండుగ సీజన్‌లో షీ టీమ్స్ మొత్తం 478 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ముఖ్యంగా, గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు షీ టీమ్స్ అనేక మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 14 బృందాల షీ టీమ్స్ పాల్గొన్నాయి.

ఈ మేరకు మంగళవారం షీ టీమ్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 478 కేసులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోగా, వాటిలో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారని తెలిపారు. వీళ్లలో 288 మందిని హెచ్చరించి వదిలిపెట్టినట్టు వెల్లడించారు. వీరిలో 5 గురిని దోషులుగా నిర్ధారించినట్లు తెలిపారు. ఒక నేరస్థుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇక, సహాయం కోసం షీ టీమ్స్‌ను డయల్ 100, లేదా 9490616555 వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

Next Story