రూ.2000 నోట్ల మార్పిడికి ఎస్‌బీఐ కీ ఇన్‌స్ట్రక్షన్స్

by Disha Web Desk 4 |
రూ.2000 నోట్ల మార్పిడికి ఎస్‌బీఐ కీ ఇన్‌స్ట్రక్షన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్ల రద్దుపై తీసుకున్న నిర్ణయంతో వాటిని ఎలా మార్చుకోవాలి అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ పరిధిలోని బ్యాంకులకు పలు సూచనలు జారీచేసింది. నోట్లను మార్పిడి చేసుకునే వారు ఏదైనా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. లేదా ఒక ప్రొఫార్మాను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అకౌంట్లో డబ్బలు జమ చేసుకోవాలనుకునే వారు కేవైసీని సరిచేసుకొని వారు సైతం ఒక ప్రొఫార్మాను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ బ్యాంకులు మాత్రం ఆర్బీఐ సూచనలు మినహాయించి ఖాతాదారులకు వెసులుబాటు కల్పించింది. ఎలాంటి ప్రొఫార్మా పూర్తిచేయకుండానే నగదును మార్చుకోవచ్చు. నోట్ల మార్పునకు ప్రతి బ్యాంకులో ఒక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నోట్ల మార్పిడికి వచ్చే వారికి వేరే నోట్లను ఇచ్చేందుకు గాను డబ్బులను సమకూర్చుకునేందుకు బ్యాంకులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు !

ఆర్బీఐ నిర్దేశించిన సూచనల ప్రకారం ప్రజలు సెప్టెంబర్ 30 వరకు తమ వద్ద ఉన్న 2000 నోట్లతో దేశంలో ఎక్కడైనా కొనుగోళ్లు చేయవచ్చు. ఒక వేళ ఆ నోట్ల స్థానంలో మరో నోట్లు కావాలంటే మాత్రం బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాల్సిందే. ఖాతాదారులు మాత్రం తమ వద్ద ఉన్న నోట్లను ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి లిమిట్ కానీ, షరతులు కానీ లేవు. గతంలో 500 నోట్ల మార్పిడిలో ఉన్న సిబ్బందే ఇప్పుడున్నారు.

ప్రస్తుతం సైతం వీరినే వినియోగించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అదనపు సిబ్బందిని కేటాయించకపోవడంతో రద్దీ ఎక్కువైనప్పుడు అనేక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని అదనపు సిబ్బందిని నియమిస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రెండువేల రూపాయల నోట్ల మార్పిడి విషయంలో సామాన్య ప్రజల నుంచి బ్యాంకులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే రాజకీయ నాయకులు, పెద్దపెద్ద వ్యాపారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహించేవారు ప్రత్యేక మెకానిజం ద్వారా తమ లావాదేవీలు జరుపుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి నుంచే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా బ్యాంకు అసోసియేషన్ కార్యదర్శి సీత రాంబాబు అభిప్రాయపడ్డారు.

గుర్తింపు పత్రాలు లేకుండా ఎక్స్‌చేంజ్

రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల్లో ఎలాంటి ఫాంలు నింపాల్సిన అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. నోట్ల మార్పిడికి ఎలాంటి గుర్తింపు పత్రాలు సైతం చూపించాల్సిన పనిలేదని చెప్పింది. రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చని పేర్కొంది. నోట్ల మార్పిడిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం స్టేట్ బ్యాంక్ బ్రాంచీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

బంగారం షాపులు కిటకిట

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణతో నగరంలోని పలు జువెల్లరీ దుకాణాల్లో ఆదివారం రద్దీ పెరిగింది. గులాబీ నోట్లను యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో తెలుసుకుని కొనుక్కోడానికి క్యూ కట్టారు. బిజినెస్ స్వల్పంగా పెరిగింది. కొన్ని దుకాణాల్లో ‘ప్రీమియం రేట్’ పేరుతో వాస్తవ ధర మీద దాదాపు 8 శాతం మేర ఎక్కువ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ అన్ ఆర్గనైజ్డ్ షాపులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు జువెల్లరీ అసోసియేషన్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

Read More: రూ.2000 నోట్లు తీసుకోబడవు.. వైన్ షాపు ఎదుట బోర్డు

Read more:

డిపాజిట్లకు KYC కంపల్సరీ



Next Story