ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర అంటూ.. సీఎస్‌‌పై గవర్నర్ ఫైర్

by Disha Web Desk 4 |
ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర అంటూ.. సీఎస్‌‌పై గవర్నర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ ట్వీట్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి తీరుపై ఫైర్ అయ్యారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మర్యాదపూర్వకంగానైనా రాజ్ భవన్‌కు రాలేదని, కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడలేదని మండిపడ్డారు.

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మీకు అధికారికంగా రాజ్ భవన్‌ను సందర్శించడానికి సమయం దొరకలేదు. ప్రోటోకాల్ పాటించడం లేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. మర్యాదపూర్వకంగా ఆహ్వానించినా ఆ మర్యాద చూపడం లేదు. చర్చల వల్లే ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ మీకు అలాంటి పరిష్కారం ఇష్టం లేదు అని అభిప్రాయపడ్డారు. అనంతరం మరో ట్వీట్ చేసిన గవర్నర్ మళ్లీ గుర్తు చేస్తున్నాను ఢిల్లీ కంటే రాజ్‌భవన్ సమీపంగా ఉందన్నారు.

కాగా అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెడింగ్‌లో పెట్టారని, తక్షణమే ఆ బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఉత్తర్వులు ఇవ్వాలని నిన్న సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చింది. అయితే గవర్నర్ ట్వీట్‌ను చూస్తే ఈ అంశంలో తను సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంను ఆశ్రయించడానికి ముందే తనను సంప్రదించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రగతి భవన్‌కు, రాజ్ భవన్‌కు మధ్య సంబంధాలు నామమాత్రంగా ఉన్న సందర్భంలో ఈ పరిణామంతో అగాధం ఎవరూ పూడ్చలేనంద దూరం వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. గవర్నర్ ట్వీట్‌పై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed