శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్​న్యూస్

by Disha Web Desk 2 |
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్​న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్​చెప్పింది. స్పెషల్ టూర్​ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి వీకెండ్‌కు ప్రత్యేక సర్వీసులను నడపనున్నది. ఈ మేరకు టూర్​ప్యాకేజీ వివరాలను బుధవారం ఆర్టీసీ వెల్లడించింది. ప్రతి వీకెండ్‌కు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌.. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శనంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖరారు చేసింది.

ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌‌లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దర్శనాన్ని చేసుకోవాలి. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఉంటుంది.

రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్‌ పూర్తవగానే హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది. సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది. రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

"ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికికు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని సంస్థ అందిస్తోంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ ప్యాకేజీని యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలి. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ tsrtconline.inలోకి వెళ్లి టికెట్లను బుకింగ్‌ చేసుకోవాలి. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్​సూచించారు.



Next Story

Most Viewed