‘సీబీఐకి ఇవ్వడంలో పెద్ద కుట్ర’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి ఇవ్వడంలో పెద్ద కుట్రదాగి ఉన్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.

‘సీబీఐకి ఇవ్వడంలో పెద్ద కుట్ర’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి ఇవ్వడంలో పెద్ద కుట్రదాగి ఉన్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చే వంద ఏళ్ళు నష్టం కలిగించే కుట్ర దాగి ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ విషం చిమ్మారని.. కిషన్‌రెడ్డి లేఖతో ఎన్‌డీఎస్ఏ వచ్చిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టకుండా కేసులు వేసిన చంద్రబాబు కుట్ర సీబీఐ విచారణ వెనుక ఉందని పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమీషన్ రూ.6 కోట్లు రికవరీ చేయాలని చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకూలంగా అధికారులు ఎవరూ మాట్లాడవద్దని రేవంత్‌రెడ్డి అధికారులను బెదిరించారని పేర్కొన్నారు.

పీసీ ఘోష్ కమిషన్ మహాదేవపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు కమిషన్ రిపోర్టు ఇచ్చిందని చెప్పారు. సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన డాక్టరేట్‌పై అనుమానం ఉందని.. సిర్పూర్‌లో హాస్పిటల్ పెట్టి పేద ప్రజల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. డీపీఆర్ లేకుండా కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంపై సీబీఐ విచారణ జరగాలని.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇంతియాజ్ అహ్మద్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

Next Story