గ్రూప్-1 పరీక్ష మళ్ళీ రద్దు కావడానికి కేసీఆరే కారణం: RS ప్రవీణ్ కుమార్ ఫైర్

by Disha Web Desk 19 |
గ్రూప్-1 పరీక్ష మళ్ళీ రద్దు కావడానికి కేసీఆరే కారణం: RS ప్రవీణ్ కుమార్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండోసారి రద్దు కావడానికి ముమ్మాటికి కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఆనాడే బీఎస్పీ డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమిషన్ని ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదని తెలిపారు. ఇంక టైం వేస్టు చేయకుండా.. టీఎస్పీఎస్సీ మొత్తం కమీషన్ అర్జంటుగా రాజీనామా చేయాలని, కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించిన తర్వాతనే మిగతా పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన 270 ఓఎంఆర్ షీట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు. ‘సిట్’ ఇన్వెస్టిగేషన్లో కమిషన్ చైర్మన్, సభ్యులు, ఎస్ఓ వెంకటలక్ష్మిలను నిందితులుగా చేర్చాలన్నారు. ఈ కేసును సీబీఐకు అర్జంటుగా అప్పగించాలన్నారు.

అందరూ అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్‌లో జరగనున్న గ్రూప్-2, మిగతా పరీక్షలన్నీ కొత్త కమిషన్ హయాంలోనే జరగాలని, ఈ కమిషన్‌పై ప్రజలకు విశ్వాసం లేదు(ఒక్క కేసీఆర్ కుటుంబానికి తప్ప) అని పేర్కొన్నారు. గ్రూప్ 1 కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలన్నారు. గత గ్రూప్-1 ప్రిలిమ్స్ టాపర్ ఎవరో ముఖ్యమంత్రే స్వయానా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్ అన్నీ జరగనిచో తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిరగనివ్వద్దని నిరుద్యోగులను కోరారు. నిరుద్యోగ మిత్రులారా, దయచేసి నిరాశ పడకండి.. బహుజనరాజ్యంలో పారదర్శకంగా నిజాయితీగా పరీక్షలను నిర్వహించుకుందామని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed