'గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి'

by Disha Web Desk 4 |
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014‌లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు.

గత ఎనిమిదిన్నర ఏళ్లలో 1700 మంది తెలంగాణ వలస కూలీలు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారని, ఇందుకు శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్‌లో శవపేటికల రిజిస్టర్ సాక్ష్యం అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన కార్మికుల పునరావాసం, పునరేకీకరణ గురించి ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టాలని, సమగ్ర ఎన్నారై పాలసీలో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఏటా రూ.18 వేల కోట్ల విదేశీ మారకం

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ప్రతినెలా రూ.1,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బి. ఎం. వినోద్ కుమార్ అన్నారు. ఈ విధంగా ఏడాదికి రూ.18 వేల కోట్ల రూపాయల చొప్పున గత ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.లక్షా 53 వేల కోట్లు తెలంగాణకు చేరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడిందని ఆయన అన్నారు.

ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గత ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.15 వేల 300 కోట్ల ఆదాయం సమకూరిందని వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారకం రూపంలో, రాష్ట్రానికి పన్నుల రూపంలో గల్ఫ్ కార్మికులు మేలు చేస్తున్నారు. ఎడారి ఎండలో తమ చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మును స్వదేశానికి పంపిన వలస కూలీల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గోపిడి ధనుంజయ రెడ్డి అన్నారు



Next Story