వామ్మో... రోడ్డు రోలర్.. BRSకు ఎలక్షన్ సింబల్ టెన్షన్!

by Disha Web Desk 4 |
వామ్మో... రోడ్డు రోలర్.. BRSకు ఎలక్షన్ సింబల్ టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్‌ పార్టీకి రోడ్డు రోలర్ గుర్తు గుబులు పుట్టిస్తున్నది. సాధారణ ఎన్నికల మొదలు ఉప ఎన్నికల వరకు ఈ గుర్తుతో చిక్కులు తలెత్తుతున్నాయి. టీఆర్స్‌కు అధికారికంగా కేటాయించిన కామన్ సింబల్ ‘కారు’ గుర్తును రోడ్డు రోలర్ గుర్తు పోలి ఉండడమే ఇందుకు కారణమనేది గులాబీ నేతల వాదన. టీఆర్ఎస్‌కు పడాల్సిన ఓట్లు రోడ్డు రోలర్‌కు పడుతున్నాయని ఆందోళన పడుతున్నారు. ఈ గుర్తును ‘ఫ్రీ సింబల్స్’ జాబితా నుంచి తొలగించాలంటూ పదేండ్ల క్రితమే కేంద్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది. చివరకు 2011 నవంబరులో ఈసీ ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే జాబితా నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నది. ఈ ఉత్తర్వుల సంగతి ఎలా ఉన్నా 2018 తర్వాత మళ్ళీ ఈ గుర్తు వివాదానికి దారితీసింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక మొదలు తాజాగా ముగిసిన మునుగోడు బై ఎలక్షన్ వరకు ఈ గుర్తుతో బీఆర్ఎస్‌కు చిక్కులు తలెత్తాయి. అప్పటివరకూ స్వతంత్ర అభ్యర్థులకు మాత్రమే ఈ గుర్తును ఈసీ అలాట్ చేసేది. తాజాగా ఈ గుర్తును యుగతులసి అనే పార్టీకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌‌లోనూ కామన్ సింబల్‌గా కేటాయిస్తూ ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 సెగ్మెంట్లలోనూ ఈ గుర్తు తరఫునే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కారుకు పడాల్సిన ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుకు పడడంతో స్వల్ప తేడాతో ఓడిపోయామని బీఆర్ఎస్ వాపోయింది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలోనూ 1,880 ఓట్లు పడ్డాయి.

రోడ్డు రోలర్ మాత్రమే కాక రోటీ మేకర్ గుర్తు కూడా బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా పరిణమించినట్లు ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు. 2020 నవంబరులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఆ ఏడాది జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రోడ్డు రోలర్, రోటీ మేకర్, కెమెరా, డోలీ, టీవీ, సోప్ డిష్, కుట్టుమిషన్ తదితరాలను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ రిక్వెస్టు చేసింది. దృష్టి దోషం ఉన్న ఓటర్లలో ఈ గుర్తు గందరగోళం సృష్టిస్తున్నదని, కారుకు పడాల్సిన ఓట్లు వీటి వెళ్ళిపోతున్నాయని వివరించింది. మునుగోడు ఉప ఎన్నికలకూ ఇదే కన్‌ఫ్యూజన్ రిపీట్ అయింది.

ఇంతకాలం కొన్ని స్థానాలకే ఈ తలనొప్పి ఉంటే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకూ ముప్పుగా పరిణమిస్తుందన్నది ఆ పార్టీ ఆవేదన. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను కీలకం కానుండడంతో రోడ్డు రోలర్ గుర్తుతో వచ్చే చిక్కులపైనే ఆందోళన పడుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో ఈ గుర్తులతో వచ్చిన చిక్కులను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ తరఫున వినోద్ కుమార్ పలు విజ్ఞప్తులు చేశారు. హుజూర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో ఢిల్లీలోని ఈసీకి కంప్లైంట్ చేశారు. తాజాగా యుగ తులసి పార్టీకి రెండు రాష్ట్రాల్లో కామన్ సింబల్‌గా కేటాయించడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా మరోసారి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నది. ఒకవేళ సానుకూల స్పందన రాకపోతే సుప్రీంకోర్టునూ ఆశ్రయించాలనుకుంటున్నది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక (2020 నవంబర్)లో బీఆర్ఎస్ అభ్యర్థి 1,079 ఓట్లతో ఓడిపోగా రోటీ మేకర్ గుర్తుతో పోటీచేసిన బండారు నాగరాజు (ఇండిపెండెంట్)కు 3,510 ఓట్లు పోల్ అయ్యాయి.

హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక (2019 అక్టోబర్)లో రోటీమేకర్ గుర్తుతో పోటీచేసిన సుమన్‌కు 2,697 ఓట్లు వచ్చాయి.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన యుగతులసి అభ్యర్థి శివకుమార్‌కు 1,880 ఓట్లు పడ్డాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్‌లో రోడ్డు రోలర్ గుర్తుకు 4,330 ఓట్లు, సిర్పూర్‌లో 4,039, మునుగోడులో 3,569, డోర్నకల్‌లో 4,117, హుజూరాబాద్‌లో 2,660, భూపాలపల్లిలో చపాతీ మేకర్ గుర్తుతో పోటీచేసిన మంతెన సంపత్‌కు 4,787 ఓట్లు, దేవరకొండలో రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన రమావత్ నాయక్ 3,247 ఓట్లు, గజ్వేల్‌లో ఇదే గుర్తుతో పోటీచేసిన కంటె సాయన్న (థర్డ్ ప్లేస్) 3,353 ఓట్లు చొప్పున ఓట్లు పడ్డాయి.



Next Story

Most Viewed