- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల్లో నిధుల విడుదలకు సహకరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ రాష్ట్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు గ్రామీణ యువతకు సైతం ఉపాధి లభించబోతోందని అన్నారు.
రూ.10,400 కోట్లతో హైదరాబాద్-విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర గతిని మార్చే రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు రూ.36 వేల కోట్లతో చేపట్టబోతున్నాయని వివరించారు. ఇక రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డు ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణానికి రూ.11,399 కోట్లతో మరికొద్ది రోజుల్లోనే టెండర్లు పిలవబోతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా రూ.8 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవేను రూ.20 వేల కోట్లతో నిర్మించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.






