TG: కేబినేట్ నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం.. మంత్రి పొంగులేటిని కలిసి ధ‌న్యవాదాలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-06 13:21:00  IST  )

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల‌కు బాస‌ట‌గా నిలుస్తుంద‌ని ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప్రభుత్వం చేయూత‌గా నిలుస్తుంద‌న్నారు.

TG: కేబినేట్ నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం.. మంత్రి పొంగులేటిని కలిసి ధ‌న్యవాదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల‌కు బాస‌ట‌గా నిలుస్తుంద‌ని ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప్రభుత్వం చేయూత‌గా నిలుస్తుంద‌న్నారు. పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్యల‌ను ద‌శ‌ల వారీగా ప‌రిష్కరిస్తుంద‌న్నారు. కేబినేట్ ఉద్యోగుల విష‌యంలో గురువారం తీసుకున్న నిర్ణయాల ప‌ట్ల హ‌ర్షం వ్యక్తం చేశారు. రెండు డీఏల చెల్లింపు, ఆరోగ్య ప‌థకం అమ‌లుకు ట్రస్ట్, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రతి నెల రూ.700 కోట్ల విడుద‌ల‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన బ‌దిలీ అయిన ఉద్యోగులు సొంత జిల్లాల‌కు తిరిగి వెళ్లెలా తీసుకున్న నిర్ణయాల ప‌ట్ల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల‌కు ధ‌న్యవాదాల‌ను తెలిపారు. సీసీఎల్ఏ ప్రాంగ‌ణంలోని డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ కార్యాల‌యం శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జేఏసీ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి, జేఏసీ నాయ‌కులు మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగుల స‌మ‌స్యల‌పై ముగ్గురు ఐఏఎస్ అధికారుల‌తో ఛైర్మన్‌గా న‌వీన్‌ మిట్టల్ సార‌ధ్యంలో త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలతో చ‌ర్చలు జ‌రిపిందన్నారు.

జేఏసీ సమావేశంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంటిజెంట్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిగణలోకి తీసుకుని ఆమోదించిన‌ తీర్మానాలను మూడు విభాగాలుగా చేసి అత్యవసర, ఆర్థికేతర, ఆర్థిక సమస్యలు అధికారులకు వివ‌రించినట్లు చెప్పారు. ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, నూతన పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ పునరిద్దంచాలని, పొరుగు సేవల ఉద్యోగుల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 317 GO ద్వారా మరి కొన్ని రకాల బదిలీలకు అవకాశం కల్పించాలని కోరామ‌న్నారు. రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ-కుబేర్ ద్వారా క్లియరెన్స్ చేయాల‌ని కోరామ‌న్నారు. దీనికి ప్రభుత్వం ప్రతి నెల‌లో రూ.700 కోట్లు క్లియ‌ర్ చేసేందుకు అంగీకారం తెలిపింద‌న్నారు. ఇది ప్రతి ఉద్యోగికి ఎంతో లాభ‌మ‌న్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించేందుకు అత్యుత్తమ ఆరోగ్య ప‌థ‌కం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయ‌నుంద‌న్నారు. ట్రస్ట్‌లో ఉన్నతాధికారులు, ఉద్యోగులే స‌భ్యులుగా ఉండే విధంగా రూపొందించ‌డంతో ఇబ్బందులు త‌లెత్తవ‌న్నారు.

పొంగులేటికి ధన్యవాదాలు

రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేలా చొరవ చూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని జేఏసీ కోరింది. మంత్రిని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి కేబినేట్ నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలిపారు. స‌మావేశంలో జేఏసీ కో ఛైర్మన్లు కె.రామకృష్ణ, ఎస్.రాములు, టీపీయూఎస్ నాయకుడు కె.హన్మంత్ రావు, తెలంగాణ కమర్షియల్ టాక్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు దేవేందర్, తెలంగాణ వ్యవసాయ అధికారుల అసోసియేషన్ జి.కృపాకర్, తెలంగాణ అగ్రికల్చర్ డాక్టర్ల అసోసియేషన్ కె.రాములు, ట్రెసా నాయకుడు బాణాల రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story