మంత్రి పొంగులేటిని క‌లిసిన రెవెన్యూ సంఘాల నేత‌లు.. పదోన్నతి కల్పించడంపై కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-29 14:09:43  IST  )

మంత్రి పొంగులేటిని క‌లిసిన రెవెన్యూ సంఘాల నేత‌లు.. పదోన్నతి కల్పించడంపై కృతజ్ఞతలు

మంత్రి పొంగులేటిని క‌లిసిన రెవెన్యూ సంఘాల నేత‌లు.. పదోన్నతి కల్పించడంపై కృతజ్ఞతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ సంఘాల నాయ‌కులు మంగ‌ళ‌వారం క‌లిసి కృతజ్ఞతలు తెలిపారు. ప‌దోన్నతుల‌కు ప్రత్యక్ష్యంగా, ప‌రోక్షంగా స‌హ‌కారం అందించిన‌ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీసీఎల్ఏ లోకేష్ కుమార్ కు, ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అన్ని స్థాయిల్లోని రెవెన్యూ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. అన్ని క్యాడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ పదోన్నతులు రెవెన్యూ శాఖలో ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచి, ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడానికి దోహదపడతాయన్నారు. వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన‌ప్పటి నుంచి రెవెన్యూ శాఖ‌లో ప‌దోన్నతుల శ‌కం మొద‌లైంద‌న్నారు. చ‌రిత్రలోనే తొలిసారిగా 33 సెల‌క్షన్‌ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్ పోస్టుల‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింద‌న్నారు. ప్రస్తుతం 44 మంది డిప్యూటీ క‌లెక్టర్లకు స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్టర్లుగా ప‌దోన్నతి క‌ల్పించింద‌న్నారు. ఇదే కాకుండా సీనియ‌ర్ అసిస్టెంట్ నుంచి న‌యాబ్ త‌హ‌శీల్దార్ వ‌ర‌కు ప‌దోన్నతుల‌ను క‌ల్పించింద‌న్నారు. అలాగే రాష్ట్రంలోని 10,954 గ్రామాల‌లో జీపీఓల నియామ‌కం చేప‌డుతుంద‌న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తహశీల్దార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, తహశీల్దార్ల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాధ, సెక్రెటరీ జనరల్ పూల్ సింగ్, పాల్ సింగ్ పాల్గొన్నారు.

Next Story