సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

by Disha Web Desk 12 |
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైంది. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకోవడమే తప్ప, వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. న్యాయంగా వారికి దక్కాల్సిన హక్కు అయిన.. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్న మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయిన లేదు. ఎంత సేపు రాజకీయాలే తప్ప జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గోసను పట్టించుకునే సోయి లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అవార్డుల వెనుక పగలనక రాత్రనక కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పడిన శ్రమ ఉంది.

వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామ పంచాయితీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు. ఇంత చేసి మీకు అవార్డులు తెస్తే వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా వేధించడం ఎంత వరకు సహేతుకం. వారి కష్టానికి మీ ప్రభుత్వం ఇచ్చే రికార్డు ఇదేనా. తెలంగాణ వస్తే కాంట్రాక్టు, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు అంటూనే 2018 నూతన పంచాయతీరాజ్ చట్టం మేరకు గ్రామాల అభివృద్ధి కోసం బాండ్ లేబర్ మాదిరిగా మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ తో 2018 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి 2019 ఏప్రిల్ 12న 9,355 మందిని పలు రకాల షరతులను విధించి రూ. 100 బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకుని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ప్రొబేషనరీ మూడేళ్ల పీరియడ్ 2022, ఏప్రిల్ 11న పూర్తయింది. అయితే వారిని రెగ్యులర్ చేయకుండా ప్రొబేషన్ టైమ్ మరో ఏడాది పెంచుతున్నట్లు సీఎం హోదా మీరు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

ఆ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ప్రొబేషన్ పీరియడ్ తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ప్రొబేషన్ ను ఏడాది పెంచడం కోసం 2022, జూలై 17న , తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ యాక్టుకు విరుద్ధంగా జీఓ నెం 26 ద్వారా జారీ చేశారు. పొడిగించిన ఏడాది ప్రొబేషన్ పీరియడ్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ 11తో ముగిసింది. అయిన దున్నపోతు మీద వానకురిసినట్లు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగారు. ఇటువంటి సమస్యలను సావధానంగా విని పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనం.

గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులను అప్పగించి రోజు 10 నుంచి 12 గంటలపాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో వెట్టి చాకిరి చేయించుకుంటోంది మీ ప్రభుత్వం. రోజు రోజుకు నిర్వహించాల్సిన బాధ్యతలు పెరుగుతుండటం, మితిమీరిన ఒత్తిడితో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పటికే స్థానిక రాజకీయాల కారణంగా రాష్ట్రంలో దాదాపు 1500 మంది ఉద్యోగాలు వదిలేశారు. ఇతర అనారోగ్య సమస్యలతో 44 మంది వరకు మృతి చెందారు. ఇంత చేస్తున్న మీ ప్రభుత్వం గ్రామ కార్యదర్శుల రెగ్యులర్ చేసే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనే ఆశ ఉన్నప్పటికీ తక్కువ జీతమే అయిన వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వదులుకోకూడదని జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో చేరారు. ఎంతో పనిభారం పెరిగినా భరిస్తూ రెగ్యులర్ చేస్తారని ఆశగా ఎదురు చూశారు.

మూడేళ్ల ప్రొబేషన్ ముగిసిన మరో ఏడాది పొడిగించిన ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుందనే సదుద్దేశంతో దానికి కూడా అంగీకరించి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. ఇప్పుడు నాలుగేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్ ప్రకారం..మూడేళ్ల తర్వాత గ్రేడ్-4 ఉద్యోగులుగా గుర్తించాలి. కానీ నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా ఆ దిశగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోంది. మీ దౌర్భగ్యం కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాల రెగ్యులరైజేషన్ కోసం రోడెక్కే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా! ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక... వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతాం.

డిమాండ్లు

  • జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కోరుకుంటున్న విధంగా వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి.
  • 4 సంవత్సరాల సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలి.
  • కేడర్ స్ట్రెంట్ తోపాటు సర్వీసును రూపొందించాలి.
  • 010 పద్దు కింద వేతనాలిస్తూ EHS కార్డులను అందజేయాలి.
  • చని పోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
  • OPS (Outsourcing Secretary) వారిని కూడా రెగ్యులర్ చేయాలి.
  • ఇతర శాఖల్లోని ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా మహిళా పంచాయతీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలి.
Next Story

Most Viewed