పూర్తి విశ్వాసంతో ఉన్న రేవంత్ రెడ్డి.. ఫోకస్ మొత్తం దానిపైనే!

by Disha Web Desk 2 |
పూర్తి విశ్వాసంతో ఉన్న రేవంత్ రెడ్డి.. ఫోకస్ మొత్తం దానిపైనే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో పదవి కోసం ఢిల్లీ వరకూ వెళ్ళి లాబీయింగ్, పైరవీలు చేసుకోవడం ఆనవాయితీ. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం ఇదే జరిగింది. వారాల తరబడి అక్కడే మకాం వేసి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చాలా మంది ప్రయత్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవుల కోసం కూడా ఇదే మార్గాన్ని అనుసరించడం రివాజు. ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు ఇదే ప్రయత్నాలు చేశారు. కానీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం బేఫికర్‌గా హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. వర్గాలు, గ్రూపులు లాంటి హడావిడి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండడం ఎమ్మెల్యేలనే ఆశ్చర్యానికి గురిచేసింది. కష్టపడి పనిచేసినవారిని పార్టీ గుర్తిస్తుందని, తగిన ప్రాధాన్యత ఇస్తుందన్న నమ్మకంతో హైదరాబాద్‌లోనే హోటల్‌లోనే ఉండిపోయారు.

పదవుల కోసం కొద్దిమంది ఢిల్లీ వరకూ వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఏఐసీసీ పరిశీలకులతో సమావేశమై వారి కోరికను చెప్పుకుంటున్నారు. ఇంకొందరు అధిష్టానం దృష్టికి వెళ్ళేలా పైరవీలు చేయించుకుంటున్నారు. మంత్రివర్గంలో మాత్రమే కాక ప్రభుత్వంలో పదవులను కోరుకుంటుంటున్న మరికొందరు వారివంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఆయా స్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నా పదవి దానంతట వెతుక్కుంటూ వస్తుందని భావించారో ఏమో.. రేవంత్‌రెడ్డి మాత్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయాల్సన పనులను, ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి స్కెచ్ వేస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

ఢిల్లీ వరకూ వెళ్ళి పదవిని తెచ్చుకోవాలనే తాపత్రయం కంటే పదేండ్లలో ప్రజలు కోల్పోయిన హక్కులు, స్వేచ్ఛ, సౌకర్యాలు, సంక్షేమం తదితరాలపై తోటి ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏయే అంశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలో లెక్కలేసుకుంటున్నారు. పదవి వస్తుంధనే ధీమాతో పాటు రాకపోయినట్లయితే పార్టీ అప్పజెప్పిన బాధ్యతను నెరవేర్చడానికి మానసికంగా సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోక వస్తుందంటూ ఎన్నికల ప్రచారం సమయంలో ఎంతటి ధీమా వ్యక్తం చేశారో ఇప్పుడు రాష్ట్ర పాలనా పగ్గాలు కూడా తనకే వస్తాయని అంతే ధీమాతో ఉన్నారు. పదవి కోసం ఢిల్లీకి వెళ్ళి లాబీయింగ్ చేసుకోవాలనే ఆలోచనే లేకుండా హైదరాబాద్‌లోనే ఉండిపోవడంలోని ధైర్యం ఎమ్మెల్యేలకే అంతుపట్టలేదు.

రెండు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్నా, ఏఐసీసీ స్థాయిలో ముమ్మరంగా కసరత్తు జరుగుతున్నా పదవి మీద ధ్యాసే లేకుండా నింపాదిగా ఉండడం గమనార్హం. పార్టీని పవర్‌లోకి తీసుకురావాలన్న టార్గెట్ కంప్లీట్ కావడంతో ఇకపైన జరగాల్సిన ప్రాసెస్ అంతా హైకమాండ్ చూసుకుంటుందని, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. అధికారంలోకి రావడం ఖాయమని ప్రదర్శించిన కాన్ఫిడెన్సునే ఇప్పుడు పాలనా పగ్గాలూ వస్తాయనే నమ్మకంతో ఉండడం ఎమ్మెల్యేలకే మింగుడుపడలేదు.



Next Story