పేపర్​లీకులో కేటీఆర్‌ది కీలక పాత్ర: రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
పేపర్​లీకులో కేటీఆర్‌ది కీలక పాత్ర: రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్‌ది కీలక పాత్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసులో కేటీఆర్‌తో పాటు పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేపర్ల లీకు కేసులో సిట్ విచారణకు గురువారం హాజరైన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పేపర్ లీక్ వ్యవహారంలో పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్‌దే అని అన్నారు. కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పీఏ తిరుపతికి పేపర్ లీకేజ్‌లో కీలక భాగస్వామ్యం ఉందని రేవంత్ ఆరోపించారు. వంద మందికి పైగా 100 మార్కులు వచ్చాయని గతంలో తాము చెబితే... వారిని విచారించాల్సింది పోయి సిట్ ద్వారా నోటీసులిచ్చి ప్రభుత్వం తనను భయపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని, వివరాలను సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్‌కు అందించామని తెలిపారు. సిట్ కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు మాత్రమే నోటీసులిచ్చి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. తమను భయపెట్టేందుకే అధికారులతో ప్రభుత్వం ఈ పని చేయించినట్లు తెలుస్తోందన్నారు. నేరం ఎలా జరిగిందో కేటీఆర్ వివరించారని, ఈ వ్యాఖ్యలు సిట్ అధికారులు తమ దృష్టికి రాలేదనడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. కేటీఆర్‌పై ఫిర్యాదు తీసుకోబోమని, కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని అధికారులు చెప్పారని రేవంత్ తెలిపారు.

కేటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్‌ను విచారణ చేయాల్సిందేనని సిట్ అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. ఈ నెల 24, 25న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమం ఉంటుందని, 25న సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లు, క్వాలిఫై అయిన వారి, ఉద్యోగాలు వచ్చిన వారి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచేలా చూడాలని అధికారులను కోరామని రేవంత్ తెలిపారు.

ఆంధ్రా అధికారి చేతిలో తాళాలా?

30 లక్షల తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్ ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయని రేవంత్ ప్రశ్నించారు. ఇంత పెద్ద వ్యవస్థకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదా ఉన్న ఒక్క తెలంగాణ బిడ్డ లేడా కేసీఆర్ అని నిలదీశారు.

కాలినడకన సిట్ కార్యాలయానికి

కాంగ్రెస్ నేతలతో కలిసి సిట్ కార్యాలయానికి బయలుదేరిన రేవంత్ రెడ్డి వాహన శ్రేణి లిబర్టీ చౌరస్తాకు చేరుకోగానే.. రేవంత్ వాహనం మినహా ఇతర వాహనాలు వెళ్లకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసులతో రేవంత్ కాసేపు వాగ్వాదానికి దిగారు. ఆ తరువాత కారు దిగి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాలినడకన సిట్ కార్యాలయానికి చేరుకుని ఆధారాలు సమర్పించారు.



Next Story