గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 17 లోగ అమలు

by Disha Web Desk 13 |
గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 17 లోగ అమలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్న తెలంగాణ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ఇందులో ఓ ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామన్నారు. సెప్టెంబర్ 17 లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. మంగళవారం తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడితూ.. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని.. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందన్నారు.

ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్, కేరళలో మంచి విధానం ఉందని ఈ విషయంలో ఇతర దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. అన్నీ అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వం కూడా సమగ్ర విధానం రూపొందిస్తామన్నారు. గల్ఫ్ కార్మికులకు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని రాబోయే రోజుల్లో రైతు బీమా ఉన్నట్లుగానే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం ఏర్పాటు ఆలోచన చేస్తున్నామన్నారు. ఏ దేశంలోనైనా తెలంగాణ బిడ్డలు ఇబ్బందుల్లో ఉంటే వారు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాల్లో కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇక్కడ ఏదైనా ఆస్తులు కొనుకుంటే అలాంటి ఆస్తులు వివాదాల్లో చిక్కుకుంటున్నాయని అలాంటి ప్రాపర్టీకి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని కుటుంబాల్లోని వారు విదేశాలకు వెళ్తే ఇక్కడ ఉండే వారి తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకునే వారు ఉండరని అందువల్ల విదేశాలకు వెళ్లిన వారి ఆరోగ్యంతో పాటు ఇక్కడ ఉన్న వారి పేరెంట్స్ ఆరోగ్యం, ఇతర సహాయం అందించేలా వారి వివరాలు కూడా ప్రభుత్వం నమోదు చేసుకునేలా ఆలోచన చేస్తున్నామన్నారు. వారి పిల్లల చదువుల కోసం రెసిడెన్సియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం ఆలోచన చేస్తోందన్నారు. అయితే ఈ అంశం రాష్ట్ర పరిధితో పాటు కేంద్ర పరిధిలోని అంశం అని అందువల్ల జాతీయ స్థాయిలో మీ ప్రతినిధులు ఉండాలని అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


Next Story

Most Viewed