నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కా : రేవంత్ రెడ్డి

by Dishanational2 |
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కా :  రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నించినందుకు నోటీసులకు తమకు ఇస్తూ..దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌ కు సమాచారం ఇస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పేపర్ లీకేజీ అంశంపై రేవంత్​ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.ఈ కేసులో బ్యాంకు లావాదేవీల కంటే ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగాయన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని, మనీలాండరింగ్, హవాలాతోపాటు విదేశాల్లో నూ లావాదేవీలు జరిగాయన్నారు. దీంతోనే సిట్ ఒక్కటే ఈ కేసును విచారించలేదని, సీబీఐ, ఈడీ, ఏసీబీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు గత రెండు, మూడు రోజులుగా అపాయింట్‌మెంట్ అడుగుతుంటే సీబీఐ, ఈడీ డైరెక్టర్లు తమకు సమయం ఇవ్వడం లేదన్నారు.

ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కూడా వర్తిస్తుందని రేవంత్ పేర్కొన్నారు. కానీ సిట్ అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా పెట్టకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు.అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెడితే, ఈ కేసులు ఏసీబీ పరిధిలోకి వెళ్తాయని, ఏసీబీ కోర్టుకు క్రిమినల్ కేసులను కూడా విచారించే అధికారం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తద్వారా విచారణ త్వరగా ముగుస్తుందన్నారు. సీబీఐకి కేసు ఇస్తే ఈడీ కూడా వస్తుందన్నారు. అప్పుడు ఇంకా సత్వరంగా కేసులు తేలే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం నిందితుల మీద పెట్టిన సెక్షన్లు, సాధారణ కోర్టుల్లో విచారణ జరిగితే ఈ కేసు తేలడానికి ఏళ్ల సమయం పడుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఇక ఈ కేసు నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి.. ఎదురుదాడి చేస్తూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం అబద్దం అన్నారు. డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే.. నిందితుల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందన్నారు. దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు రావడంతో విధిలేని పరిస్థితుల్లోనే టీఎస్పీఎస్సీ బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకు ప్రభుత్వం కేసును సిట్ కు అప్పగించిందన్నారు.తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలు జరిగినప్పుడు.. అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపించినప్పుడు... వారిని కాపాడేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సిట్ ను నియమిస్తోందని చెప్పారు. ఎంసెట్, నయీం కేసుల నుంచి మొదలు ఇప్పటివరకూ వివిధ కేసుల్లో సిట్ ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు.

మరోవైపు సిట్ విచారణ నివేదికను కోర్టుకు ఇవ్వకముందే జగిత్యాలలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు ఎలా వచ్చిందని? రేవంత్ ప్రశ్నించారు.ఈ ఇష్యూలో కేటీఆర్ పీఏ తిరుపతి చిన్న పావు మాత్రమే అని అన్నారు. కేటీఆర్ వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉన్నదన్నారు. ఆయనకు నోటీసులు ఇవ్వకపోగా తమపై క్రిమినల్ కేసులు పెడతామని మీడియాకు లీకులు ఇవ్వడం వెనక ఆంతర్యమేమిటనీ ప్రశ్నించారు. కేటీఆర్ కు సమాచారం నేరగాళ్లు ఇచ్చరా?.. విచారణ అధికారి ఇచ్చారా? ఈ సమాచారం ఎవరిచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. తమకు నోటీసులు ఇచ్చిన ఏఆర్ శ్రీనివాస్ ,కేటీఆర్ కు ఎందుకు ఇవ్వరు? దీని వెనక గూడుపుఠానీ ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి శ్రీనివాస్ ట్రాక్ రికార్డు సరిగ్గా లేదని రేవంత్ అన్నారు. గతంలో హై కోర్టుకు కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయనకు రెండు వారాల శిక్ష విధించిందన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగుల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న సమస్యను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు.కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ బిడ్డలైతే తక్షణమే ఈ కేసును తెలంగాణ అధికారులతో జరిపించాలన్నారు. సీబీఐ, ఈడీ, ఏసీబీ డిపార్ట్ మెంట్స్ కలిపి సిట్ వేసి ఇందులో ఉన్న పెద్దలందరిని శిక్షించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.మరోవైపు గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూపు 1 పరీక్షలో లాలాగూడాలోని ఒక కేంద్రంలో ఉదయం 10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరగాల్సిన పరీక్షను, మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 నిమిషాల వరకూ పరీక్ష నిర్వహించినట్లు రేవంత్ గుర్తు చేశారు.అక్కడ ఏం జరిగింది? అనే దానిపై సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నదని రేవంత్​ కోరారు.

Next Story

Most Viewed