ఎన్నికల టైమ్‌లో ఊహించని షాక్.. ‘రియల్’ బిజినెస్‌పై నోట్ల రద్దు ఎఫెక్ట్!

by Disha Web Desk 2 |
ఎన్నికల టైమ్‌లో ఊహించని షాక్.. ‘రియల్’ బిజినెస్‌పై నోట్ల రద్దు ఎఫెక్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు వేల రూపాయల నోట్ల చెలామణిపై రిజర్వుబ్యాంకు ఆంక్షలు విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పడుతున్నది. ఆ రంగానికి చెందిన ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ రేటు, ప్రైవేటు రేట్ రూపాల్లో ఈ బిజినెస్ జరుగుతున్నందున ‘బ్లాక్’ రూపంలో జరిగే చెల్లింపులపై ఎపెక్టు పడనున్నది. దాదాపు 80% మేర చెల్లింపులు నల్లధనం రూపంలోనే జరుగుతున్నందున రెండు వేల రూపాయల నోట్లను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఫ్లాట్‌లు, ప్లాట్‌ల కొనుగోలుదారులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకునే సమయంలో ఇన్‌కమ్ సోర్స్ వెల్లడించడానికి పడే ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికి వాటిని తీసుకోడానికి నిరాకరిస్తారు. ఈ కారణంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగినందున ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఎఫెక్టు వెంటనే పడుతుందనే అభిప్రాయాన్ని పలువురు రియల్ వ్యాపారులు వ్యక్తం చేశారు. మార్కెట్‌లో చెలామణిలో రెండు వేల రూపాయల నోట్లు కేవలం 30% మాత్రమే అయినప్పటికీ ఆ మేరకు వ్యాపారం మీద ఎఫెక్టు ఉంటుందన్నారు. సెప్టెంబరు వరకూ నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంకు అవకాశం ఇచ్చినందున అప్పటివరకు ఆ ఎఫెక్టు కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా పికప్ కావచ్చనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఎన్నికల టైమ్‌లో రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసేవారిలో రియల్ వ్యాపారులు కూడా ఒకరనేది సాధారణ అభిప్రాయం. ఈ ఎఫెక్టు పొలిటికల్ పార్టీలపై గణనీయంగానే ఉంటుంది.

తెలంగాణలో రానున్న ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఆర్బీఐ వెల్లడించిన నిర్ణయం పార్టీలకు ఊహించని పరిణామం. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది రానున్న కాలంలో తేలనున్నది. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కొంతకాలం లావాదేవీలు తగ్గుముఖం పట్టడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న నేతల్లో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రియల్ వ్యాపారంతో సంబంధాలున్నాయి. పైగా ఎన్నికల జరగనున్న టైమ్‌లో ఖర్చు కోసం భూములను అమ్ముకుని సిద్ధం కావడం ఆనవాయితీ. రోజువారీ ప్రచార అవసరాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చుచేసే నేతలు ఇప్పుడు భూములు అమ్ముకుందామనుకున్నా ఏ మేరకు ఆశించిన ఫలితాలు వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలోనే జువెల్లరీ వ్యాపారం, ఇన్‌వాయిస్‌లు లేకుండా అక్రమంగా జరిగే వ్యాపారాలకూ ఆర్బీఐ నిర్ణయం ఇబ్బందికరంగా మారనున్నది.

ఇవి కూడా చదవండి:

రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన

2000 వేల నోట్లు రద్దు.. RBI నిబంధనలు ఇవే



Next Story