మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి అండగా అధికార పార్టీ లీడర్లు

by Disha Web Desk 4 |
మతిస్థిమితం లేని మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి అండగా అధికార పార్టీ లీడర్లు
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : సరిగ్గా మతిస్థిమితం లేని, తినడానికి తిండి కూడా లేని దీనస్థితిలో ఉన్న 16 ఏళ్ల ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ వార్డులో మూడు పూటలా తినడానికి కూడా తిండి లేని, సరిగ్గా మతిస్థిమితం లేని ఒక పదహారేళ్ల మైనర్ బాలిక, తన 90 ఏళ్ల వయసున్న అవ్వతో కలిసి నివసిస్తుంది. ఈ అమ్మాయి తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే చనిపోగా, ఉన్న ఒక తమ్ముడు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని తెలిసింది.

సొంత ఇల్లు కూడా లేని పరిస్థితిలో బాధితులు ఉన్నారు. ఎవరైనా అన్నం పెడితే కడుపు నింపుకోవాలి తప్ప మూడు పూటలా తినడానికి తిండి కూడా లేని దీన స్థితి. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మైనర్ బాలికపై గత నాలుగు రోజుల క్రితం అదే వార్డుకు చెందిన నరేష్ అనే వ్యక్తి మృగంలా ప్రవర్తించి అతి నీచంగా అత్యాచారం చేశాడని స్థానికులు చెబుతున్నారు. బాలికకు వెనక ముందు ఎవరు లేకపోవడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, నరేష్ అనే నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పోలీసులు వెల్లడించారు. నరేష్ అనే వ్యక్తి బాలిక యొక్క ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. నరేష్‌పై ఐపీసీ, ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు.

మైనర్ బాలిక అత్యాచారంతో పాలి ‘ట్రిక్స్’..!

ఇదిలా ఉంటే ఒక అతి నిరుపేద కుటుంబంలో ఉన్న ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు ఒళ్ళు మరిచి అత్యాచారం చేస్తే అలాంటి మానవ మృగాన్ని కాపాడడానికి వికారాబాద్ పట్టణానికి చెందిన కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు లోలోపల ఒప్పందాలు చేస్తున్నారు. నిందితుడిపై కేసు కాకుండా అనేక ప్రయత్నాలు చేశారని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం ఘటనలో కూడా రాజకీయాలు చేస్తారా..? నరేష్ లాంటి మృగాలను జైల్లో పెట్టి బంధించాల్సింది పోయి, అలాంటి వారికి మద్దతుగా నిలిచి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం పట్ల స్థానికులు ఫైర్ అవుతున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఈ మైనర్ బాలిక కేసు పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని పలువురు కోరుతున్నారు. సదరు వ్యక్తికి సపోర్ట్ చేసిన నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఈ కేసు పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేసే వరకు కేసును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed