తీర్మానాలతోనే సరి.. అమలు ఎప్పుడు మరి...

by Disha Web Desk 20 |
తీర్మానాలతోనే సరి.. అమలు ఎప్పుడు మరి...
X

దిశ, తలకొండపల్లి : ప్రజలు ఓట్లతో ఎన్నుకోబడిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు గ్రామాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రతి మూడునెలలకు ఒకసారి మండల కేంద్రంలో నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేసి జిల్లా కార్యాలయానికి, కలెక్టర్కు పంపినా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులలో నిరుత్సాహం నెలకొంది. ప్రతి సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, జేసీ సీఈవో, ఆర్డీఓ లాంటి అధికారులకు కూడా మండలసభకు రావాలని నివేదికలు అధికారికంగా పంపించిన కేవలం స్థానిక ఎమ్మెల్యే మాత్రమే వస్తున్నాడు. సమావేశాలు మొక్కుబడిగా కొనసాగుతున్నడంతో స్థానిక నేతలు సైతం సమావేశాలకు రావాలంటేనే ఒక్క రోజు సమయం మొత్తం వృధా అవుతుందని సర్పంచులు ఎంపీటీసీలు డుమ్మాలు కొడుతున్నారు.

ప్రజా ప్రతినిధులే డుమ్మాలు కొడుతుంటే మేమేమి తక్కువ చేసామనే రీతిలో అధికారులు కూడా యదేచ్ఛగా సర్వసభ్య సమావేశాలకు రాకుండా ముఖం చాటేస్తున్నారు. సెప్టెంబర్ మాసంలోని 26వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు... మండలంలోని పాఠశాలలో డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులను వెంటనే తిరిగి వారి వారి స్థానాలకు రప్పించాలని, ఆమ్లెట్ గ్రామాల్లో కూడా రేషన్ పంపిణీ చేయాలని, మండలంలోని నాలుగు వెటర్నరీ స్థాయి సబ్ సెంటర్లో పర్మనెంట్ డాక్టర్ పోస్ట్ ను అపాయింట్మెంట్ చేయాలని కోరుతూ, పశువులకు వ్యాపించే రోగాల బారి నుండి కాపాడడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని, 2020 నుండి 2022 వరకు చనిపోయిన పశువులకు ఇన్సూరెన్స్ డబ్బులు, చంద్రధన గ్రామపంచాయతీలో రైతు వేదిక మంజూరు కోసం, 2019 నుండి మంజూరు కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, గ్రామపంచాయతీలోని వీధిలైట్ల నిర్వహణ సర్పంచ్ లే నిర్వహించబడేలాగా చూడాలని, రైతులు ఎదుర్కొంటున్న ధరణి లోని సమస్యలను పరిష్కరించాలని, విజయ డైరీలో రైతులకు రావలసిన నాలుగు రూపాయల ఇన్సెంటివ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి సభ్యులందరూ ముక్తకంఠంతో తీర్మానాలు చేసి పంపించారు.

అదేవిధంగా జనవరి 18, 2023 నిర్వహించిన మరో సర్వసభ్య సమావేశంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై నామమాత్రంగా దాడులు చేస్తున్నారని, సమావేశాలకు రావాలని, కంటి వెలుగు కార్యక్రమంలో అవసరమైన రోగులకు ఆపరేషన్లు చేసే విధంగా చూడాలని, అంగన్వాడి కేంద్రాలలో నాసిరకం గుడ్లు సరఫరా చేస్తున్నారని సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ, వికలాంగుల పింఛన్లకు సంబంధించిన సదరన్ క్యాంపులు ఆమనగల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయాలని, మండలంలోని రేషన్, పింఛన్లు రేషన్ షాపుల వారిగా ఆయా గ్రామాల్లో పంపిణీ చేయుట, తలకొండపల్లి నుండి మిడ్జిల్ వరకు ఉన్న వంతెనలు పూర్తి చేయాలని కోరారు.

తలకొండపల్లి నుండి కడ్తాల్ రోడ్ లో మిగిలిపోయిన కిలోమీటర్ ఆర్ అండ్ బీ రోడ్డును వెడల్పుగా విస్తరించాలని, విద్యాశాఖలోని ఖాళీగా ఉన్న అన్నిటీచర్ పోస్టును భర్తీ చేయాలని, గ్రామాల్లోని ఇండ్లపై వేలాడుతున్న కరెంటు తీగలను వెంటనే మార్చాలని కోరుతూ మండల సభలో సభ్యులందరూ ముక్తకంఠంతో తీర్మానాలు చేశారు. ప్రతి మండలసభలో సుమారు పదుల సంఖ్యలో పలుసమస్యలపై సభ్యులందరూ తీర్మానాలు చేసి సంబంధిత జిల్లా అధికారులకు, కలెక్టర్ కార్యాలయానికి పంపించిన అమలుకు నోచుకోకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులలో నిరుత్సాహం నెలకొని ఉంది. కొన్నికొన్ని సర్వసభ సమావేశాల్లో అధికార పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు సైతం సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే ముందే మొరపెట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.

Next Story

Most Viewed