సందుకో బెల్టు షాపు.. !

by Disha Web Desk 20 |
సందుకో బెల్టు షాపు.. !
X

దిశ, తాండూరు : తాండూరు పట్టణ పరిధిలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనిలో బెల్టుషాపుల నిర్వహణ జోరుగానే కొనసాగుతుంది. అర్ధరాత్రి ఐనా మద్యం అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. నడిరోడ్డు పైనే బెల్ట్ షాప్ లు దర్శనం ఇస్తున్నాయి. అనుమతులు పొందిన వైన్స్ దుకాణాల నుంచే వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు బెల్టు షాపులకు తరలుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సంబంధిత ఎక్సైజ్ శాఖ కనుసంధల్లోనే బెల్టు షాపుల నిర్వహణ జరుగుతుందని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మద్యం తరలింపు జోరందుకోవడంతో ఎక్కడ పడితే అక్కడ తాగినోళ్లకు తాగినంత.. అన్నట్టు తయారైంది.

తాండూరు పట్టణ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప కాలనిలో పోలీసుల అండతో బెల్టుషాపులు నడుస్తున్నట్లు సమాచారం. ఏసందులో చూసినా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లెక్క వెలుస్తున్నాయ్. మొన్నటి వరకు ఉన్న ఒక్క బెల్ట్ షాప్ ను చూసి మరికొన్ని బెల్ట్ షాప్ లు మొదలయ్యాయి. వైన్స్ షాపుల నుంచి మద్యాన్ని ఆటోలు, ప్రత్యేక వాహనాల్లో తరలిస్తూ...ఊరూరా, కాలనీల్లో బెల్టు దుకాణాలు ఉండడంతో బెల్టు వ్యాపారుల హవా జోరందుకుంది.

కాలనీలో మద్యం బ్లాక్లో అందుబాటులోకి వచ్చేసింది, కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం కాలనిలో మద్యం మత్తులో ఉంటున్నారు. వైన్స్ షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి రాజీవ్ కాలనీలో ఒక మద్యం బాటిల్ పై ఎమ్మార్పీ రేటు కంటే రూ.20 నుంచి 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధిక ధరలకు విక్రయాలు, మద్యం ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. దీంతో ప్రజారోగ్యానికి చిల్లు పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలు చోట్ల కల్తీమద్యం కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. సామాన్యుల జేబుకు చిల్లు.. బెల్టు షాపులలో ధరలు కుతకుత ఉడుకుతూ.. సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ప్రతీ సీసాపైన 20 నుంచి 30 రూపాయలు అదనపుగా తీసుకుంటున్నారు. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. మద్యం మత్తులో సంబంధం లేని విషయాలతో గొడవలకుసై అంటున్నారు. పండగలకు ఇంటికి వచ్చిన చుట్టాల కోసం మద్యం దుకాణం దగ్గర లేకుంటే ఎంత దూరమైన వెళ్లి కొనుగోలు చేసి అతిథి సత్కారం చేయడం సాధారణంగా మారింది.

మద్యంమత్తు వల్ల చిన్న సంఘటన జరిగినా పెద్దదిగా చేస్తూ గొడవలకు దిగుతున్నారు. ప్రజల కళ్ళ ముందు, అధికారుల ముందు దర్జాగా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్న అబ్కారీ శాఖ అధికారులలో చిన్నపటి చలనం కూడా లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకుల దగ్గర మామూళ్లు వసూలు చేసి, చూసి చూడనట్లుగా అబ్కారి అధికారులు ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇక రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన బెల్ట్ షాప్ లకు ఏకంగా కానిస్టేబుల్ ల ఆధ్వర్యంలోనే నడిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఏకంగా కాలనిలోని మద్యం అమ్మకాల నిర్వాహకులు అర్ధ రాత్రి సమయంలో కూడా దర్జాగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని, పర్మిషన్ లేని బెల్ట్ షాప్ లను మూసివేసి, కాలనీలో ఉండకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరారు.



Next Story

Most Viewed