యదేచ్చగా సాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దందా.. వైద్యం కోసం వెళితే ఇక అంతే..

by Disha Web Desk 20 |
యదేచ్చగా సాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దందా.. వైద్యం కోసం వెళితే ఇక అంతే..
X

దిశ, ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్రైవేట్ హాస్పిటల్స్‌పై వైద్య ఆరోగ్యశాఖఅధికారులు దృష్టి సారించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.సరైన ప్రమాణాలు పాటించని హాస్పిటళ్లలో వైద్యం త్రీ సూదులు,6 గోలీలుగా వర్ధిల్లుతోంది. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది లేకపోయినా.. కేవలం డాక్టర్ సర్టిఫికెట్లు మాత్రమే చూపించి ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించేందుకు అనుమతులు పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.కనీస వసతులు లేని ఆసుపత్రుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలకు, పిఎంపీలకు, అంబులెన్స్ డ్రైవర్లకు కమిషన్ల ఎర చూపించి పేషెంట్లను తమ ఆసుపత్రులకు రప్పించుకుంటున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో వైద్యం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఆసుపత్రులతో పాటు రక్త పరీక్షలు, ఎక్స్ రే క్లినిక్ లు యదేచ్చగా వారికి నచ్చిన ధరలలో కొనసాగిస్తున్నారు.

ఆర్ఎంపీలు సైతం పెద్ద పెద్ద ఆస్పత్రులను ఏర్పాటు చేసుకొని అన్ని రోగాలకు చికిత్సలు నిర్వహిస్తున్నా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిద్రమత్తును విడడం లేదని గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు మునిసిపాలిటీ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిజ్ఞానం ఉన్న వైద్యులు లేకపోగా.. ల్యాబ్ టెక్నీషియన్లుగా గుర్తింపు లేని వ్యక్తులను నియమించుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేయాలి? ఏ చికిత్సకు ఎంత డబ్బు చెల్లించాలి? అనే బోర్డులను ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్స కోసం దేనికి ఎంత చెల్లించాలి? అనే సూచిక బోర్డులు లేకపోవడంతో గ్రామీణ నిరక్షరాస్యులైన పేద ప్రజలను దొరికిన కాడికి దోచుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నస్టిక్స్, ఫిజియోథెరపీ, ల్యాబులు ఫీజుల విషయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కానింగ్ సెంటర్లు నడవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని వైద్యులు కొంతమంది డబ్బే ప్రధాన ఎజెండాగా గర్భిణీ మహిళలకు అబార్షన్లు చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు.లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ గతంలో కొంతమంది వైద్యులు పట్టుబడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి.

ప్రజల ప్రాణాలకు ఖరీదు కడుతున్న హాస్పిటల్స్

4 మండలాలకు కూడలిగా హైదరాబాదుకు సమీపంలో గల ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మారుమూల గ్రామ ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు వచ్చే పేదలకు వైద్యం పేరుతో వారి ప్రాణాలను బలిగొంటున్నారు. పట్టణంలోని స్వాతి మల్టీప్లెక్స్ హాస్పిటల్‌లో 2 రోజుల క్రితం నరేష్ రెడ్డి అనే యువకుడు మరణించిన విషయాన్ని పట్టణ ప్రజలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా తలకొండపల్లి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన గర్భిణి మహిళ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించడంతో,విషయం బయటకు పోకుండా హైదరాబాద్‌లో మంతనాలు జరిపి 8 లక్షల వరకు డబ్బులు ముట్ట చెప్పిచేతులు దులుపుకున్నారు.

గత 2 రోజుల క్రితం రాంపూర్ గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి కూడా డాక్టర్ల ఆపరేషన్ వికటించి మృతి చెందడంతో కుటుంబసభ్యులు పెద్దఎత్తున ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. చివరకు కొంతమంది నేతలు మంతనాలు జరిపి బాధిత కుటుంబసభ్యులకి పెద్దమొత్తంలో డబ్బు ముట్టచెప్పి చేతులు దులుపుకున్నట్లు మున్సిపాలిటీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఆమనగల్ పట్టణ కేంద్రంలోని ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరు చనిపోయిన డోంట్ కేర్.. డబ్బులు ఉంటే చాలు కిమ్ అనకుండా లోలోన ముట్ట చెప్పి 4 రోజులు ఆస్పత్రి బందు చేసి,అనంతరం మళ్లీ డాక్టర్లను నేమ్ బోర్డు మార్చేసి తెరుచుకొని నడపొచ్చు అనే ధీమాలో ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి నాణ్యత ప్రమాణాలు పాటించని ఆసుపత్రులపై, ల్యాబ్ లపై, స్కానింగ్ సెంటర్లపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed