మేయర్ దత్తత ఉత్తిదేనా? ఈర్ల చెరువులో కానరానీ అభివృద్ధి..

by Disha Web Desk 6 |
మేయర్ దత్తత ఉత్తిదేనా? ఈర్ల చెరువులో కానరానీ అభివృద్ధి..
X

దిశ, మియాపూర్: ఆచెరువును నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి గత ఏడాది దత్తత తీసుకొన్నారు. ఇక అక్కడ ఎవరికి అందని రీతిలో అభివృద్ధి పరుగులు పెట్టి ఉంటుందని ఇంగిత జ్ఞానం ఉన్న వారెవరైనా అనుకుంటారు. నిజానికి అక్కడ ఉండే వాస్తవ పరిస్థితులు చూస్తే నివ్వెర పోవడం మన వంతవుతుంది. అక్కడ దీర్ఘకాలంగా అంటే సుమారు 4 ఏండ్లుగా మురుగు సమస్య పరిష్కరించలేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టూ పక్కల ఉండే సుమారు 40 కాలనీ నుంచి వచ్చే మురుగు నీరు దాంట్లోనే కలుస్తుండడంతో దీంతో 10 పరిసర కాలనీలో ప్రజలు గత 4 ఏండ్లుగా తీవ్ర దుర్గంధంతో కలుషిత వాతావరణంలో అనారోగ్యాల బారిన పడి తీవ్రమైన మనోవేదన చెందుతున్నామని చెప్పడం గమనార్హం.

ఆ చెరువు చందానగర్ సర్కిల్ 21 హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీర రోడ్డులో వైశాలి నగర్ ను అనుకొని ఉన్న ఈర్ల చెరువు. అయితే ఈర్ల చెరువు ను గత సంవత్సరమే దత్తత తీసుకున్నప్పటికీ అభివృద్ధి కి ఏ మాత్రం నోచుకోలేదు. దీంతో మేయర్ దత్తత చెరువు అభివృద్దే ఇలా ఉంటే ఇతర చెరువులకు వారిచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భరించలేని దుర్గంధం తో గత నెల 28 న ట్విట్టర్ లో మంత్రి, కమిషనర్, మేయర్ కు ఫిర్యాదు..

చందానగర్ సర్కిల్ - 21 హఫీజ్ పేట్ డివిజన్ (109) పరిధిలో మదీనాగూడ మంజీరా పైప్ లైన్ రోడ్డును ఆనుకొని వైశాలి నగర్ ను అనుకోని ఈర్ల చెరువు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. అయితే నగరాభివృద్ధి లో భాగంగా కాల క్రమేణా చుట్టూ ఎన్నో నూతన కాలనీ లు అవతరించాయి. దీంతో చుట్టుపక్కల ఉండే సుమారు 40 కాలనీ నుంచి మురుగు నీటి కాలువ నుంచి వచ్చే నీరు చేరువలో కలియడంతో కాలుష్య కాసారంగా తయారయ్యింది. చెరువులోకి చేరిన మురుగు నీటితో పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనితో పాటు బోర్‌వెల్ నీరు కూడా కలుషితం అయి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యతో చుట్టూ ఉండే 10 కాలనీల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏప్రిల్ 28 న మంత్రి కేటీఆర్ , కమిషనర్ , మేయర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం.



సమస్య భరించలేక చెరువులోని మురుగు నీటిని బయటకు వదిలిన వైనం..

ఎగువన ఉన్న మై హోం తదితర గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ఇబ్బందులు కలగకుండా అక్కడ నుంచి ఇక్కడ వరకు మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు చేసి చెరువు ఇన్ లెట్ వద్ద వదిలేయడం విశేషం. అయితే బడా బాబులకు ఒక రూల్ మాకొక రూలా అంటూ 10 కాలనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు దుర్వాసన సమస్య తీవ్రమవడంతో భరించ లేక కొంతమంది అవుట్ లెట్ వద్ద జేసీబీ సాయంతో మురుగు నీటిని బయటకు వదిలి వేయడం గమనార్హం. నాలుగు ఏళ్లుగా ఈ సమస్య ఇలా ఉంటే నెలలో రెండు మూడు సార్లు చెరువు ను మేయర్ సందర్శిస్తూ సమస్యను పరిష్కారం చేయకపోవడం లో ఆంతర్యం ఏమిటో అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Also Read: జీహెచ్ఎంసీలో మూగబోయిన ప్రజావాణి.. ముచ్చటగా మూడేళ్లు..


Next Story

Most Viewed