ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : మంత్రి Sabitha Indra Reddy

by Disha Web Desk 13 |
ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : మంత్రి Sabitha Indra Reddy
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 144 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎంతో మంది ఉపాధ్యాయులు అనేక గొప్ప గొప్ప పదవులను అధిరోహించిన వారు ఉన్నారని, అందులో సర్వేపల్లి రాధాకృష్ణ ముఖ్యులని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలకు ఓర్చుకుని చదివి, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ.. దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి సేవ చేసిన మహా వ్యక్తి అని కొనియాడారు. స్వార్థాన్ని విడిచి అందరి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని అన్నారు.


అంతే కాక అబ్దుల్ కలాం లాంటి వారిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మనం బ్రతకడం తో పాటు మరికొంత మందిని బతికించాలని, పది మంది కోసం పని చేసిన వాళ్ళు సమాజంలో మహానుభావులుగా మిగిలిపోతారని, అలాంటి పవిత్రమైన వృత్తిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమాజానికి అవసరమైన ఉన్నత వ్యక్తులను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ప్రపంచాన్ని సృష్టించడం లో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అయితే విద్యార్థులకు చదువుతోపాటు, సంస్కారాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందని, నవ సమాజ నిర్మాణం, సమాజ మార్పు ఉపాధ్యాయుల పై ఆధారపడి ఉందని, అందువల్ల ఉపాధ్యాయులు గురుతర బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని అన్నారు.


ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని మన ఊరు-మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమం ప్రారంభించారు. ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకులాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో బాలికల శాతం పెరిగినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి భారం లేకుండా చేస్తుంది అని అన్నారు.


ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరికీ బాధ్యత కూడా పెరుగుతుంది అని తెలిపారు. మన రాష్ట్రంలో వస్తున్న మంచి పరిణామం లో భాగంగా విద్యా రంగంలో కూడా మంచి పరిణామం వచ్చేలా మీరంతా కృషి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజాన్ని తీర్చిదిద్దే ప్రతి ఒక్కరూ గురువెనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం తోపాటు, దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తీర్చి దిద్దడం లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, చేవెళ్ల శాసనసభ్యులు కాల యాదయ్య, ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ హార్దిక, ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహీపాల్ మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed