ఎనీ "టైం" మందు.. విందు

by Disha Web Desk 12 |
ఎనీ టైం మందు.. విందు
X

దిశ, ఇబ్రహీంపట్నం: రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఆకలి తీర్చడంతో పాటు వారికి ఉపాధి కూడా లభిస్తుందని తొలుత చిన్న చిన్నగా ప్రారంభమైన దాబాలు క్రమేపీ బార్ల లాగా మారుతున్నాయి.రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఆకలి తీర్చడంతో పాటు వారికి ఉపాధి కూడా లభిస్తుందని తొలుత చిన్న చిన్నగా ప్రారంభమైన దాబాలు క్రమేపీ బార్ల లాగా మారుతున్నాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొంతమంది ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారం శృతి మించుతోంది. దాబాల్లో కేవలం ఆహార పదార్థాలు మాత్రమే లభిస్తాయని బోర్డులు పెడుతున్నప్పటికీ లోపల మాత్రం విందుతో పాటు మందు సైతం దొరుకుతుంది. అధికారికంగా లైసెన్సులు ఉన్న వైన్సులే రాత్రి పది గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలనే నిబంధనలున్నాయి.

కానీ ఇందుకు విరుద్ధంగా నిర్వహిస్తున్న దాబాలు మాత్రం అర్ధరాత్రి వరకు వెళ్లిన ఏ బ్రాండ్​ కావాలంటే ఆ బ్రాండ్​ లభిస్తుంది. కానీ ధర మాత్రం వారు నిర్ణయించినంత ఇవ్వాల్సిందే. దాబాకు వెళ్లి ఆర్డర్​ చెస్తే చాలు కూర్చున్న చోటుకే విందుతో పాటు మందు కూడా వస్తుందంటే దాబాలు ఏ మేరకు యథేచ్ఛగా నడుస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దాబాలు ఉదయం నుంచి రాత్రి వరకు నడవాలంటే కొంతమంది అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతున్న ఈ తంతుపై పూర్తిగా నిఘా కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు..

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు పెడుతుంటే అవి క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావడం లేదని తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మేడిపల్లి, సత్తక్కపల్లి శివారులో గల కొన్ని దాబాలకు మెట్​పల్లి డివిజన్​ చుట్టూ ప్రాంతాలకు చెందినవారే కాకుండా నిజామాబాద్​ జిల్లా నుంచి కూడా వస్తారు. దాబాల్లో మద్యం సేవించిన మందుబాబులు ఆ మద్యం మత్తులో రోడ్డుపై ద్విచక్రవాహనాలతో విన్యాసాలు చేస్తూ వెళ్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే మందుబాబులు విన్యాసాలు చేసుకుంటూ వాహనాలు నడిపితే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అధికారులపై ఆరోపణలు..

అక్రమ మద్యాన్ని అరికట్టడంతో పాటు అర్ధరాత్రి వరకు నడుస్తున్న దాబాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఈ దందాను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రహదారి వెంబడి ఉన్న ఈ దాబాల దందాపై ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story