ఓటు హక్కు పవిత్రతను కాపాడాలి : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే మూలస్తంభమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా చూడడం ప్రతి పౌరుడి బాధ్యత అని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

ఓటు హక్కు పవిత్రతను కాపాడాలి :  ఎమ్మెల్యే
X

దిశ, షాద్‌నగర్: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే మూలస్తంభమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా చూడడం ప్రతి పౌరుడి బాధ్యత అని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం అనంతరం భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిందని, అదే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందన్నారు. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడం, బోగస్ ఓట్ల నమోదు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఓటర్ల జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఫారం-6 తో కొత్త ఓటరు నమోదు, ఫారం-7 తో అనర్హత,డూప్లికేట్ ఓట్ల తొలగింపు, ఫారం-8 తో వివరాల సవరణ, మార్పు చేసుకోవాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండేలా స్వచ్ఛందంగా అధికారులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అధికారులు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, ఎవరైనా ఓటును తొలగించే ముందు ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. రాజకీయ పార్టీలు కూడా నిజమైన ఓటర్లను తొలగించడం, బోగస్ ఓట్లను నమోదు చేయించడం వంటి చర్యలకు పాల్పడకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకునేలా అవగాహన పెంచాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రతిష్ఠను కాపాడాలంటే స్వచ్ఛమైన ఓటరు జాబితా అత్యంత కీలకమని, ప్రతి అర్హుడికి ఓటు ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నరసింహ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story