లే అవుట్ కాపీ లేకుండానే విక్రయాలు

by velandi.Saikiran |

అవేమీ తమకు వర్తించవని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి గ్లోబల్ ప్రైడ్ తాజ్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట భారీ

లే అవుట్ కాపీ లేకుండానే విక్రయాలు
X

దిశ,మాడ్గుల : ఏదైనా వ్యవసాయ భూమిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలా కన్వర్షన్ చేసి డీటీసీపీకి దరఖాస్తు చేసుకోవాలి. అవేమీ తమకు వర్తించవని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి గ్లోబల్ ప్రైడ్ తాజ్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన మాడ్గుల మండలం ఉమ్మడి కలకొండ గ్రామపంచాయతీ పరిధిలోని సండ్రల్ గడ్డ తండా సమీపంలోనే వెలుగు చూసింది. సర్వేనంబర్ 158/2అ లో 5 ఎకరాల 5 గుంటలు, 158/ఆ సర్వే నెంబర్‌లో లేఅవుట్ కాపీ లేకుండానే హద్దురాళ్లు పాతారు. వీటిలో ప్లాట్ల లెక్కన, 155 సర్వే నెంబర్‌లోని 15 ఎకరాల 30 గుంటల భూమిని గుంటల లెక్కన విక్రయించి భారీ మోసానికి పాల్పడ్డారు.

అసలు ఆ భూమికి నాలా కన్వర్షన్ చేయలేదు. అయినా డీటీసీపీ ఎల్ పీ నెంబర్ 63/2017/ హెచ్‌ఆర్‌ఓ‌హెచ్ 1 నెంబర్ ఎలా వచ్చింది అనేది వేయి డాలర్ల ప్రశ్న. హైదరాబాద్‌కు దగ్గరలో ఉంటుందని ఆన్‌లైన్‌లో అందమైన బ్రోచర్లను చూసి 2017 సంవత్సరంలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ప్లాట్లను కొనుగోలు చేసిన కొనుగోలుదారులు మోసపోయారు. ఇదిలాఉంటే సబ్ రిజిస్ట్రార్‌లో కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయో ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత తతంగం జరిగి ప్లాట్లు విక్రయించిన సదరు ల్యాండ్ వ్యవసాయ పొలంగానే ఇప్పటికీ ఆన్ లైన్‌లో చూపిస్తుండడం కోసమెరుపు.

గ్లోబల్ ప్రైడ్ తాజ్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట జరిగిన మోసంలో అప్పటి అధికారుల పాత్ర, నాయకుల పాత్ర తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి సదరు వెంచర్‌పై సమగ్ర విచారణ జరిపి పేద, మధ్యతరగతికి చెందిన కొనుగోలుదారులకు న్యాయం చేసి, అక్రమాలకు పాల్పడిన వెంచర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీవో వేజన్నను వివరణ కోరగా.. వెంచర్ చేసిన సమయంలో తాను లేనని, అప్పుడు జరిగిన విషయాలు తనకు తెలియవన్నారు. వెంచర్ చేసిన సమయంలో 10శాతం ల్యాండ్‌ను గ్రామ పంచాయతీకి చేసినట్లు చెప్పారు. తాను వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉన్న ఒక ఎకరంలో చేసిన ఇల్లీగల్ వెంచర్‌లోని హద్దురాళ్లను తొలగించామని పేర్కొన్నారు.

Next Story