గోపాలుడి కళ్యాణం కమనీయం..

by Sumithra |
గోపాలుడి కళ్యాణం కమనీయం..
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని చుక్కాపూర్ గ్రామానికి సమీపంలోని కలికిదోన గుట్టపై వెలిసిన శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణోత్సవం కన్నులవిందువుగా కొనసాగింది. స్వామివారి కళ్యాణాన్ని దంపతులు శ్రావణి సిద్ధార్థల చేతుల మీదుగా జరిపించారు. కళ్యాణోత్సవానికి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐక్యత పౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాండురంగారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు కావడంతో ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్ట్ సిద్ధాంతి పట్టాభి రామశర్మ, కృష్ణమూర్తి శర్మలు ముఖ్య అతిథులుగా హాజరైన నేతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు ధనలక్ష్మి- శ్యాంసుందర్ గుప్తా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు కలికిదోన గుట్టపైకి వచ్చే రహదారి ముందు భాగంలో సుమారు పది లక్షల రూపాయలతో నిర్మించిన ముఖద్వారాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని చుక్కాపూర్, వెల్జాల్, తలకొండపల్లి గ్రామాలలో దేవాలయాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయని, దేవాలయాల నిర్మాణాల కోసం దాతలు విరాళాలు పెద్ద మొత్తంలో అందించడం గొప్ప శుభ పరిణామం అన్నారు.

కలికిదోనా గోపాల స్వామి ప్రాంగణంలో 20 లక్షలతో సీసీ రోడ్డు, దేవాలయం నుంచి సుమారు కిలోమీటర్ మేర ఉన్న సంగాయిపల్లి తండా వరకు ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా త్వరలో నిర్మించనునట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చెన్నారం సర్పంచ్ స్వప్న భాస్కర్ రెడ్డి, చుక్కాపూర్ మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు రంగారెడ్డి, జంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీను, బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, నారాయణ, యాదయ్య, అశోక్ రెడ్డి, నరసింహ, మల్లేష్, గిరిజన సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed