రైతులకు న్యాయం చేయాలంటే ప్రాణం పోవాలా..? సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

by Disha Web Desk 7 |
రైతులకు న్యాయం చేయాలంటే ప్రాణం పోవాలా..? సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి వికారాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చరిత్రత్మక అవసరమని, ఒక రైతు కుటుంబానికి న్యాయం చేయాలి అంటే ఆ ఇంటి యజమాని చనిపోవాలి అన్నట్లుగా పాలన ఉందని తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ధరణి సమస్యలు, రుణమాఫీ, పోడుగుమాల సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా, కలెక్టర్‌కు వినతి పత్రం అందించే కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీసి శాశ్వతంగా రైతులను బానిసలను చేస్తున్నాడు.

సప్సిడీలు తీసేసి రైతుబీమా ఇవ్వడం సిగ్గుచేటు

రైతుబంధు, రైతు బీమా అనే సినిమా చూపించి గత కాంగ్రెస్ పాలనలో ఉన్న పంటకు భీమా, పండిన పంటకు గిట్టుబాటు ధర, ఉచిత ఎరువులు లేవు, సబ్సిడీలు లేవు, రైతులకు డ్రిప్పు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ ఏమి ఇవ్వకుండా కేవలం రైతు చనిపోతేనే రైతుబీమా ఇస్తాం అనేలా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని దెబ్బతీసి శాశ్వతంగా రైతులను పొలాలలో బానిసలుగా చేసే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రాణహిత ప్రాణం తీసింది కేసీఆర్ కాదా..?

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్ట్‌తో వికారాబాద్ జిల్లా ప్రజల పొలాలు తడపాలని చూస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రి డిజైన్ అంటూ పాలమూరు రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల లాంటి ప్రాజెక్ట్‌ల పాణం తీసింది కేసీఆర్ కాదా..? అన్నారు. ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కాకుండానే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడానికి ముఖ్యమంత్రికి బుద్ది ఉండాలన్నారు.

పోలీసుల వైఫల్యం కలెక్టరేట్‌లో ఉద్రిక్తత..!

భారీ భహిరంగ సభ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ ప్రియతమ నాయకుడు జిల్లాకు రావడంతో అభిమానం కట్టలు తెంచుకుంది. రేవంత్ వెంటే మేము అంటూ తూతూ మంత్రంగా ఏర్పాటు చేసిన బ్యారిగేట్లను తోసుకొని మరి కాంగ్రెస్ అభిమానులు, రైతులు కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. సరైన పోలీస్ బందోబస్త్ లేకపోవడంతో వారిని కట్టడి చేయలేకపోయారు. చివరికి రేవంత్ రెడ్డి సైతం అతికష్టం మీద లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ నిఖిలకు వినతి పత్రం అందించారు. ఇదిలా ఉంటే ఒక రాష్ట్ర స్థాయి భారీ జనాధారణ ఉన్న నాయకుడు వస్తే కేవలం ఒక్క డీఎస్పీని 20 మంది పోలీసులతో బందోబస్తు ఇవ్వడం ఏంటని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా జిల్లా పోలీస్ శాఖ వైఫల్యం అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed