గ్రామాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి

by Disha Web Desk 11 |
గ్రామాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి
X

దిశ, ఆమనగల్లు: గ్రామాలలో నెలకొన్న సమస్యలను అధికారులు పర్యటించి తక్షణమే పరిష్కరించాలని ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ కమ్లిమొత్య నాయక్ అధ్యక్షతన జరిగిన కడ్తాల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ బడ్జెట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని వైస్ ఎంపీపీ సభా దృష్టికి తెచ్చారు. ఎంపీటీసీ సభ్యులందరికీ జనాభా ప్రాతిపదికన సమానంగా నిధులు కేటాయించడం లేదని ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాం నాయక్ ఎంపీడీవో రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనాభా ప్రాతిపదికన సమానంగా నిధులు కేటాయించాలని ఎంపీపీకి ఎంపీ రాములు సూచించారు. అటవీ ప్రాంతంలో ఉన్న పల్లె చల్క తండా నూతన గ్రామపంచాయతీ, అంగన్వాడి, పాఠశాల భవనాలకు అటవీ సిబ్బంది అభ్యంతరం చెప్పరాదని ఎంపీ సూచించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టం వివరాలపై అధికారులకు పంపాలని ఏఓకు సూచించారు. బటర్ ప్లై వెంచర్ లో 10% ల్యాండ్ జీపీకి కేటాయించడం లేదని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సభా దృష్టికి తెచ్చారు. మండలానికి సర్వేయర్లు నియమించాలని ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు అవుతున్న విలేకరులకు మండల కేంద్రంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎంపీటీసీ లచ్చిరాం కోరగా, ఎంపీ రాములు సానుకూలంగా స్పందించి అధికారులకు సూచించారు. రావిచేడ్ గ్రామ పరిధిలోని మద్దెలకుంట తండా రోడ్డును ఎందుకు చేపట్టడం లేదని జడ్పీటీసీ ప్రశ్నించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దశరథ్ నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీడీఓ రామకృష్ణ,వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


Next Story