లక్ష్యముండి సాధన చేస్తే విజయం మీదే.. అందె శ్రీ

by Disha Web Desk 20 |
లక్ష్యముండి సాధన చేస్తే విజయం మీదే.. అందె శ్రీ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జయజయహే తెలంగాణ గీతాన్ని పరిచయం చేసిన గొప్ప ప్రజాకవి అందె శ్రీ అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి అన్నారు. నిప్పుల వాగు పుస్తకాన్ని బుధవారం అందెశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ జీవితంలో లక్షాన్ని సాధించాలంటే వినోదాన్ని దూరం పెట్టాలని, కష్టపడితే సాధించలేనిది ఏమీలేదన్నారు. మూడు అంశాలను ప్రత్యేకంగా అవలంబించాలని సూచించారు. అందులో కష్టపడాలి, నిబద్దత, లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో ప్రచురించిన ఒక కరపత్రంతో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజలను ఏకం చేసి ఆరుకోట్ల ప్రజలను అలోచింప చేశామన్నారు. భారతదేశం 120 కోట్ల ప్రజల చూపులు తనవైపు తిప్పుకుని తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు.

బక్క పలుచటి వ్యక్తి కేసీఆర్ వల్ల అయిందంటే అర్థం చేసుకోవాలని అందె శ్రీ అన్నారు. మనం తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. ఈ దేశంలో ముగ్గురు కార్యసాధకులుగా నందమూరి తారక రామారావు, కాన్షిరామ్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్ఫూర్తి అని అన్నారు. కవులు, కళాకారులకు గుర్తింపు ఉన్న చోట ప్రజారంజక పాలన అమలవుతున్నదనడానికి తెలంగాణే నిదర్శనమన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ముందుచూపుతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి బ్రహ్మాండంగా అమలు చేస్తూనే సాహితీ వేత్తలకూ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు. ఒక తెలంగాణకే కాదు.. యావత్‌ దేశానికి నాయకత్వం వహించాలి అన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి యం.మనోజ్ కుమార్ అందెశ్రీ ని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది సత్యనారాయణ, జైహింద్, ప్రసన్న, విష్ణు, రాజు, పిలోత్రీ, కార్తీక్, శరత్, పాఠకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed