అడవిలోను మొరం తవ్వేస్తున్నారు..

by Disha Web Desk 20 |
అడవిలోను మొరం తవ్వేస్తున్నారు..
X

దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపల్‌ పరిధిలో మొరం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణ శివారు నుంచి నాలుగులైన్ల రహదారి నిర్మాణం జరగడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పెద్దఎత్తున వెంచర్లు ఏర్పడడం, నిర్మాణాలు పెరుగుతుండడంతో మొరంకు డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ భూముల్లో గుట్టలకు గుట్టలు తవ్వేస్తూ కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ప్రతిరోజూ రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టిప్పర్లలో తరలిస్తూ ప్రైవేట్‌ స్థలంలో భారీగా డంప్‌లు నిల్వచేశారు. ప్రభుత్వ భూముల నుంచి కానీ అటవీ ప్రాంతాల నుంచి కానీ చెరువుల నుంచి మొరం తీయాలంటే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి కానీ, ఆమనగల్లు మండలంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

భూముల చదును పేరుతో అక్రమంగా మొరం తవ్వుతూ గుట్టల ఆనవాళ్లు లేకుండా, అటవిసంపదను కోల్లగొడుతున్నారు. ఆమనగల్లు మండల పరిధి రామునుంతల శివారు ప్రాంతంలోని అటవి ప్రాంతంలో ఎక్కడ చూసిన మొరం తవ్వకాలే దర్శనమిస్తాయి. ఈ మొరం తవ్వాకల్లో అటవి శాఖ, రెవిన్యూ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. పచ్చదనంతో కళకళలడాల్సిన అటవి సంపదను కొళ్లగొడుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మొరం తవ్వకాలతో అటవి కళ తప్పడంతో పాటు భారీ ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. రోజురోజుకి మొరం రవాణా పెరుగుతుంది. అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో మొరం అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Next Story

Most Viewed