రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: మంత్రి నిరంజన్ రెడ్డి

by Dishanational1 |
రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ /మర్పల్లి: పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు అధైర్య పడకూడదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత గురువారం కురిసిన వడగండ్ల వాన కారణంగా పంటలు నష్టపోయిన మర్పల్లి, మోమిన్ పేట్ మండల రైతులను పరామర్శించడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యటనకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులు శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు.

మర్పల్లి, మోమిన్పేట్ మండలాలలో పంట నష్టపోయిన పొలాలలో పర్యటించిన మంత్రులు పంట ఎంత నష్టం వాటిల్లిందో అనేదానిపై పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మర్పల్లిలో హెలిప్యాడ్ సమీపంలో రైతులనుద్దేశించి మంత్రులు మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రేపటిలోగా పంట నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని మంత్రులు ఆదేశించారు. మంత్రుల వెంట ఉద్యాన సంచాలకులు హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story