విద్యాలయాలకు నిలయంగా మహేశ్వరం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
విద్యాలయాలకు నిలయంగా మహేశ్వరం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం విద్యాలయాలకు నిలయంగా మారిందని, సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండలంలోని కేసీ తండాలో రూ. 4 కోట్ల నిధులతో నిర్మించిన నూతన డైట్ కళాశాలను, రూ. కోటి 70 లక్షల నిధులతో మహేశ్వరం మోడల్ స్కూల్ లో అదనపు అంతస్తు కోసం ప్రారంభించి, రూ. రెండు కోట్ల 30 లక్షల నిధులతో కేజీబీవీ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో సర్వసభ సమావేశ హాల్లో చదువులో వెనకబడ్డ వారి కోసం స్థానిక చదువుకున్న యువత సహకారంతో చేపట్టనున్న కార్యక్రమంపై సర్పంచులకు, విద్యాశాఖ ఉన్నత అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు కావాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తూ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందన్నారు. గ్రామాలలో చదువులో వెనుకబడిన వారిని స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు ప్రత్యేకంగా గుర్తించి, ఆ గ్రామంలో చదువుకున్న యువత నుంచి ఎన్జీవోల సహకారంతో వాలంటీర్లను నియమించి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత ఆంధ్యా నాయక్, డీఈవో సుశీందర్ రావు, కేసీ తండా సర్పంచ్ మోతిలాల్ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు నాయక్, బీఆర్ఎస్ నియోజకవర్గం కార్యదర్శి గుండమోని అంజయ్య ముదిరాజ్, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed