దర్జాగా మున్సిపల్ స్థలాల కబ్జా..!

by Disha Web Desk 20 |
దర్జాగా మున్సిపల్ స్థలాల కబ్జా..!
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : మున్సిపల్ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత గల హోదాలో ఉన్న కమిషనర్, మున్సిపల్ స్థలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్న పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసిన సమయం లేదు అంటూ ఎదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు తప్ప ప్రభుత్వ స్థలాలను కాపాడడంలో కమిషనర్ పూర్తిగా విఫలం అవుతున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వార్డులలో మున్సిపల్ స్థలాలు, మరికొన్ని వార్డులలో మున్సిపల్ పార్కులను సైతం కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు చూడడం లేదని తెలుస్తుంది. వీటి వెనక ఒక పెద్ద నాయకుడు ఉండడం, ఆయన కమిషనర్ కు ఒక ఆర్డర్ పాస్ చేయగానే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులను అటువైపు వెళ్లకుండా తాను మరో ఆర్డర్స్ పాస్ చేస్తూ మున్సిపల్ స్థలాలను కబ్జా దారులకు అప్పగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

గంగారంలో మున్సిపల్ స్థలం కబ్జా..!

మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు గంగారంలో రోడ్డుపక్కన దాదాపు 1500 గజాల మున్సిపల్ స్థలం ఉంది. రెవెన్యూ రికార్డ్స్ లో మున్సిపల్ స్థలం అని ఉండడంతో ఆ స్థలాన్ని మున్సిపల్ పార్కు కోసం కేటాయించాలని పాలకవర్గం భావించింది. కానీ అప్పటికే గంగారంకు చెందిన కొందరు వ్యక్తులు పశువుల షెడ్లు వేసుకొని దాదాపు 500 గజాల స్థలాన్ని కబ్జాలో ఉన్నారు. ఈ స్థలం ఎవరిదీ..? అనేది పక్కన పెడితే రికార్డ్ ప్రకారం మున్సిపల్ స్థలం కాబట్టి ఈ స్థలాన్ని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకొని పార్కు నిర్మించాలని స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

అంతే కాక డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేశారు. చివరికి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ కమిషనర్, సంబంధిత అధికారులు అటుపక్క రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య సైతం కమిషనర్ కు ఫోన్ చేసి అడగగా, 10వ తరగతి పరీక్షల పర్యవేక్షణలో బిజీగా ఉన్నానని తరువాత చూద్దాం అని తప్పించుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నోటీసులు ఇచ్చాము త్వరలోనే స్వాధీనం చేసుకుంటాము : టీపీఓ శ్రీధర్

గంగారంలో గల మున్సిపల్ స్థలం కొంత వరకు ఆక్రమణకు గురైన మాట వాస్తవం. ఇప్పటికే ఆక్రమణ దారులకు నోటీసు జారీ చేశారు. నిజానికి అక్కడ పశువుల షెడ్లు చాలా రోజుల క్రితం వేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా త్వరలో ఆ కబ్జాను చట్టపరంగా తొలగించి మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని వికారాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ వెల్లడించారు.

రాజీవ్ గృహకల్పలో అక్రమ నిర్మాణాలు.. గాఢ నిద్రలో కమిషనర్, అధికారులు..!

ఒక్క గంగారంలోనే కాక రామయ్య గూడా లాంటి మరికొన్ని వార్డులలో మున్సిపల్ పార్కులు సైతం కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉన్న పార్కు స్థలానికి ప్రహారీగోడ లేకపోవడంతో కొంత స్థలం ఇప్పటికే ఆక్రమణకు గురైదని స్థానిక నాయకులు మున్సిపల్ ల్లో ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో పరిస్థితి మరి దారుణంగా ఉంది.

ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా రోడ్డు వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా ఏ ఒక్క అధికారి అక్కడికి వెళ్ళకపోవడం గమనార్హం. ఇదేంటని ప్రశ్నిస్తే మేము పాలనా ప్రజాప్రతినిధి మనుషులమని, అధికారులు వచ్చి వారికీ కావాల్సినవి తీసుకొని వెళ్తారు తప్ప ఏమి చేయలేరని బహిరంగంగానే చెబుతున్న పరిస్థితి ఉంది. పట్టణంలో ఇన్ని ఆక్రమణలు జరుగుతున్న మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు గాఢ నిద్రలో ఉన్నారని పట్టణ ప్రజలు ప్రతిపక్ష నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మున్సిపల్ స్థలాలను కాపాడే విదంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed