నాటింది లక్షా 81 వేల మొక్కలు.. బతికింది 20 వేలే

by Disha Web Desk 12 |
నాటింది లక్షా 81 వేల మొక్కలు.. బతికింది 20 వేలే
X

దిశ, పరిగి : ఆకుపచ్చ తెలంగాణ సాధించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. తండా, గ్రామం, మున్సిపల్​ఇలా ప్రతి చోట హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటడం మొదలు వాటి సంరక్షణకు కోట్లు వెచ్చిస్తుంది. కానీ ఈ పథకం పరిగి మున్సిపల్‌లో మూడు మొక్కలు 30 వేల ఖర్చు అన్నట్లు మారింది. ప్రతి సంవత్సరం హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటుతున్నాం.. వాటి సంరక్షణ చేస్తున్నాం అంటూ కాగితాల్లో వేలల్లో మొక్కులు నాటుతున్నట్లు, లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పొందుపరచడమే తప్ప మొక్కలు పెంచిన దాఖలాలు లేవని పలువురు పట్టణవాసులు విమర్శిస్తున్నారు.

అరకోటి పైనే ఖర్చు .. 20 వేల మొక్కలు లేవు

పరిగి మున్సిపల్‌లోని 1 వార్డు నుంచి 15 వార్డులో 2019 నుంచి 2023 నాలుగేళ్లలో రూ. 53 లక్షలు 87 వేల 057 వెచ్చించి లక్షా 81 వేల 956 మొక్కలు నాటినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. ఇందులో 2019–20 సంవత్సరంలో రూ. 8 లక్షల 83 వేల 374 ఖర్చు చేసి 27 వేల 703 మొక్కలు, 2020–21 సంవత్సరంలో రూ. 27 లక్షల 69 వేల 094 వెచ్చించి 71 వేల 650 మొక్కలు, 2021–22 సంవత్సరంలో రూ. 12 లక్షల 67 వేల 542 వెచ్చించి 41 వేల 453 మొక్కలు, 2022–23 సంవత్సరంలో రూ. 4 లక్షల 67 వేల 047 వెచ్చించి 41,150 మొక్కలు నాటినట్లు రికార్డుల్లో పొందుపరిచారు.

వనాలు తప్ప మొక్కలు పెరిగిన దాఖలు

హరితహారంలో భాగంగా నాటి మొక్కలు ఎక్కడా సక్రమంగా బతుకలేవని చెప్పవచ్చు. రోడ్ల పక్కన, అంతర్గత రోడ్ల వద్ద, కార్యాలయం చుట్టూ హరితహారంలో ఆర్బాటంగా మొక్కలు నాటారు. మున్సిపల్​అధికారులు లక్షల్లో మొక్కులు నాటినట్లు, సంరక్షణ ఖర్చు లక్షల్లో కాగితాల్లో చూపిస్తున్నా మొక్కలు ఎక్కడా బతక లేదని చెప్పవచ్చు. పట్టణ ప్రకృతి వనాల్లో అక్కడక్కడా బతికిన మొక్కలు తప్ప పరిగిలో హరితహారం సక్సెస్​ అయిన దాఖలాలు లేవని చెప్పొచ్చు. రాబోయే జూన్‌లో​ మళ్లీ నాటేందుకు నర్సిరీల్లో మొక్కలు పెంచుతున్నారు. సారి కూడా ఎన్ని మొక్కలు నాటుతున్నట్లు ఫొటోలకు ఫోజిలిస్తారో వేచి చూడాలని మున్సిపల్​ ప్రజలు పేర్కొంటున్నారు.


Next Story