వైద్యారోగ్య శాఖలో డిప్యూటేషన్ల గోల్​మాల్​

by Disha Web Desk 12 |
వైద్యారోగ్య శాఖలో డిప్యూటేషన్ల గోల్​మాల్​
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: పలుకుబడి ఉండి పది మందికి పరిచయముంటే ఏదైనా చేయొచ్చు అనే ధీమాలో అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకే ఉన్నతాధికారులు మద్దతు పలుకుతున్నారు. వైద్యారోగ్య శాఖలో డిప్యూటేషన్ల గోల్​మాల్​ జరుగుతుంది. ఈ డిప్యూటేషన్ల అమలు విధానం పద్దతిగా లేదనే వాధన ఆ విభాగంలోని సిబ్బంది అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ విభాగం అధికారి వైద్యాధికారిణి తప్పుదోవ పట్టిస్తున్నారు.

జిల్లాలో అవసరమైన వైద్య ఆరోగ్య కేంద్రాల్లో నిబద్ధతగా విధులు నిర్వర్తించేందుకు డిప్యూటేషన్​ వెళ్లడం తప్పు కాదు. కానీ డిప్యూటేషన్​ వెళ్లిన అధికారులు, సిబ్బంది ఆ పీహెచ్​సీలల్లో సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అనే విషయాలు పరిశీలించాల్సిన సూపర్​వైజర్లు, వైద్యాధికారి కండ్లు మూసుకొని పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ డిప్యూటేషన్ల విషయంపై జిల్లా వైద్యాధికారిని గతంలో ఫోన్​చేసి ఆరా తీస్తే నేను ఆ చిల్లర విషయాలు పట్టించుకొనని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే వైద్యాధికారికి కొన్ని విషయాలను వివరాలతో సహా చెప్పినప్పటికి నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం వెనుక అంతర్యామేమిటనే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాకుండా దినపత్రికలలో వచ్చిన కథనాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉచిత సలహా కార్యాలయంలో పనిచేసే అధికారి వైద్యాధికారికి ఇవ్వడం గమనార్హం.

అంటే ఆ కార్యాలయంలో పనిచేసే అధికారి ఏ జిల్లా వైద్యాధికారి వచ్చిన తన మాటలతో మచ్చిక చేసుకొని వైద్య ఆరోగ్య శాఖ పరిపాలనకే కలంకం తెస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అనధికారిక డిప్యూటేషన్లను జిల్లా వైద్యాధికారి ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

గడువు ముగిసిన కొనసాగింపు ఎందుకు...?

సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖలో ఎడ్యుకేటర్​ హోదాలో పనిచేసే శ్రీ రామ సుధాకర్​ డిప్యూటేషన్​ పదవీకాలం 2022 నవంబర్​ తో ముగిసింది. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ వైద్యారోగ్యశాఖ పై సమీక్షించిన సందర్భంలో తాత్కలిక డిప్యూటేషన్​ పై వెళ్లిన శ్రీ రామ సుధాకర్ ను వెనక్కి తెప్పించుకోవాలని ఆదేశించారు.

కలెక్టర్​ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సైతం రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి శ్రీ రామ సుధాకర్​ తాత్కాలిక డిప్యూటేషన్​ క్యాన్సల్​ చేయాలని ఉత్తర్వులు పంపించారు. అయినప్పటికి రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి సంగారెడ్డికి పంపించకుండా కాలయాపన చేస్తున్నారు. అంతేకాకుండా అంతా మేము చూసుకుంటాము డోంట్​ వర్రి అంటూ వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే అధికారులు చేప్పడంపై బలమైన అనుమానాలున్నాయి.

ఆ జిల్లా అధికారి ఆదేశాలను పట్టించుకోకుండా ఈ జిల్లాలోనే కొనసాగించేందుకు విస్తృతంగా ఫైరవీలు సాగిస్తున్నారు. గత మూడు నెలలుగా డిప్యూటేషన్​ సమయం ముగిసిన తర్వాత కూడా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా అధికారులు పంపించే తప్పుడు హాజరుతో సంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖలో వేతనాలు తీసుకోవడమంటే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడమే.

తెలివిగా రంగారెడ్డి జిల్లా అధికారులు డిప్యూటేషన్​ ముగిసినప్పుడు అతను వెళ్లిపోవాలి కానీ ఇక్కడ ఎలా విధులు నిర్వహిస్తారు... సంగారెడ్డి అధికారులు ఎలా జీతాలు ఇస్తారని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అక్కడ జీతాలు ఇస్తున్నారంటే ఇక్కడ హాజరు నమోదు చేస్తే తప్పా ఇవ్వమని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు వివరిస్తున్నారు.

అనాధికారిక డిప్యూటేషన్లే అధికం...

రంగారెడ్డి జిల్లాలో ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు ఇస్తున్నారు. ఎవరికి కూడా అధికారిక ఆర్డర్లు లేవు... అంతా పైరవీలతో ఇష్టమున్న చోట విధులు నిర్వహిస్తామని మౌఖీక ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్నారు. కానీ డిప్యూటేషన్ల పై నగర శివారు పీహెచ్​సీల్లో చేరారు. కానీ ఈ పీహెచ్​సీలో పనిచేసే కొంత మంది వ్యక్తిగత అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా ఆ పీహెచ్​సీల్లో పనిచేసే స్టాఫ్​ నర్సులు, ఆశావర్కర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. డిప్యూటేషన్ల పై వచ్చిన కొంత మంది సూపర్​వైజర్లు ఇష్టానుసారంగా మహిళా సిబ్బందనే గౌరవం లేకుండా దుర్బాషాలాడుతున్నారనే ప్రచారం సాగుతుంది.

వాళ్లు చేసే మాటాలను చెప్పుకోలేక మానసికంగా లోలోపన కుంగిపోతున్నారు. అంతేకాకుండా ఉన్నతాధికారులకు పిర్యాదు చేసిన ఫలితం లేదని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ పీహెచ్‌సీలో సూపర్​వైజర్‌గా విధులు నిర్వహించే శ్రీనివాస్​4 యేండ్లుగా బాలాపూర్​పీహెచ్​సీలో ఏలాంటి అధికారిక అర్డర్​లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇతనికి అర్డర్ ఇవ్వకపోగా బాలాపూర్‌లో పనిచేసేందుకు వీలులేదు అమన్‌గల్ వెళ్లాలని ఆదేశాలు ఇచ్చేందుకు సిద్దమైన​డీఎంహెచ్​వో... ఎందుకు తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారో అర్థం కావడం లేదు.

తలకొండపల్లి పీహెచ్సీ లో పనిచేసే సిహెచ్ జ్ఞానేశ్వర్ ను సుమారు ఐదేండ్ల కాలం నుండి కందుకూరు డివిజన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా తలకొండపల్లిలో విధులు నిర్వహించే అటెండర్ యాదయ్య సంవత్సరం పైగా డిఎంహెచ్ఓ ఆఫీస్ లో విధులు నిర్వహించడం ఏమిటని మండల ప్రజలు,రోగులు మండిపడుతున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతమైనందుకే అధికారులు విధులకు రాలేక డిప్యూటేషన్ లపై దృష్టి పెట్టి రాజకీయ నాయకులతో పైరవీలు చేసుకుని హైదరాబాదుకు దగ్గరుండే ప్రాంతాలపై కన్నేశారని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed