ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

by Ratna Kumari |

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీ లలో ప్రశాంతమైన వాతావరణం లో సమర్థవంతంగా అధికారులు ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి :  కలెక్టర్ నారాయణరెడ్డి
X

దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీ లలో ప్రశాంతమైన వాతావరణం లో సమర్థవంతంగా అధికారులు ఎన్నికలను నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శనివారం రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్, వాటర్ బోర్డు ఎగ్జిక్యూట్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ ఐఏఎస్ తో కలిసి షాద్ నగర్ మున్సిపాలిటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి, మయాంక్ మిట్టల్ లు ఎన్నికల ప్రక్రియను సమీక్షించారు . స్క్రూటీనిలో ప్రతి నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అనంతరం రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను వారు పరిశీలించారు. షాద్ నగర్ మినీ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్, ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సునీత రెడ్డిని మున్సిపాలిటీలో వార్డుల, పోలింగ్ స్టేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో స్క్రూటీని దాదాపు పూర్తిగా వచ్చిందని తెలిపారు. అప్లికేషన్ లు తిరస్కరిస్తే అభ్యర్థులు రేపు అప్పిల్ చేసుకోవచ్చని అన్నారు. ఆమోదించిన నామినేషన్లను మంగళవారం మూడో తేదీ సాయంత్రం మూడు గంటల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. సాయంత్రం మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు చిహ్నాలను ప్రకటన ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో 126 వార్డులకు సంబంధించి 324 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను నిర్వహించనున్నామని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమాలు ప్రకారం వ్యవహరించాలని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని సూచించారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నోడల్ అధికారి టీ.హరీష్, షాద్ నగర్ ఆర్డీవో సరిత, ఫరూఖ్ నగర్ తహ‌శీల్దార్ నాగయ్య ఉన్నారు.

Next Story