ప్రభుత్వ భూమిని కాపాడాలని అఖిలపక్షం నాయకుల ధర్నా..

by Disha Web Desk 20 |
ప్రభుత్వ భూమిని కాపాడాలని అఖిలపక్షం నాయకుల ధర్నా..
X

దిశ, శంషాబాద్ : కొంతమంది అధికారులకు అండదండలతో బీఆర్ఎస్ నాయకులు సుల్తాన్ పల్లిలోని ప్రభుత్వభూమికి పట్టాపాస్ పుస్తకాలు మంజూరు చేయించుకున్నారని అఖిలపక్షం నాయకులు, సుల్తాన్ పల్లి గ్రామ ప్రజలు తెలిపారు. ఆ పట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డిజిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ప్రభుత్వ భూములలో జరుగుతున్న సర్వేలను నిలుపివేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శంషాబాద్ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

వీరికి మద్దతుగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్ యాదవ్, మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు నీరటీ మల్లేష్ నిలిచారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. పేదలకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులే పేదల భూములు లాక్కోవడం సిగ్గుచేటన్నారు.

శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 129, 142లో ఉన్న 25 ఎకరాల 10 ప్రభుత్వ భూమిలో 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు 84 మంది ప్రజలకు ఇందిరమ్మ పథకం కింద ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చిందన్నారు. ఆ ప్రభుత్వ భూమిలో కొందరు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనుచరులు బీఆర్ఎస్ నాయకులు అధికారుల అండదండలతో కొత్త పట్టాపాస్ పుస్తకాలు మంజూరు చేయించుకున్నారని ఆ ప్రభుత్వ భూమి మాది అంటూ జేసీబీ యంత్రాలతో చదును చేస్తున్నారన్నారు.

సర్వేనెంబర్ 129లో 14 ఎకరాల బోడవోని కుంట (చెరువు) ఉందని దాంట్లో సైతం భారీ వృక్షాలను నేలమట్టం చేసి చదును చేయడానికి చూస్తున్నారన్నారు. గ్రామస్తులు వారిని అడ్డుకోవడంతో బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిపి వాపోయారు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో పర్యటించి విచారించి పేద ప్రజలకు దక్కాల్సిన భూములను పేద ప్రజలకు కేటాయించాలని కోరారు. మంజూరు చేసిన పట్టాపాస్ పుస్తకాలను రద్దుచేసి అధికారులను తప్పుతోవ పట్టించిన నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

పేదప్రజలకు న్యాయం జరగని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ పల్లి ఎంపీటీసీ సంగీత, మాజీ సర్పంచ్ సిద్దేశ్వర ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు సంజయ్ యాదవ్, జల్లపల్లి నరేందర్, సులోచన, కోటేష్ గౌడ్, బీజేపీ నాయకులు మైపాల్ రెడ్డి, రాజిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వినయ్ కుమార్, సీపీఎం నాయకులు విక్రం కుమార్, వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆనంద్, సుల్తాన్ పల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, తదితరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed