అటకెక్కిన పౌరసరఫరాలశాఖ స్వాహా కేసు.. అక్రమార్కుల వెనకున్న హస్తమెవరిది?

by Naga Rani Yarlagadda |

రైస్ మిల్లులో దుర్వినియోగమైన సొమ్ము రికవరీ అటకెక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అటకెక్కిన పౌరసరఫరాలశాఖ స్వాహా కేసు.. అక్రమార్కుల వెనకున్న హస్తమెవరిది?
X

దిశ, తాండూరు: రైస్ మిల్లులో దుర్వినియోగమైన సొమ్ము రికవరీ అటకెక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ ఖజానాకు చేరాల్సిన సొమ్మును దారి మళ్లించి స్వాహా చేసిన ఘటన వెలుగుచూసి సుమారు 50 రోజులు గడిచిపోయింది. దానికి సంబంధించిన రికవరీ విషయంలో పట్టించుకునే వారు లేరనే చర్చ జరుగుతున్నది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారంలో రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ పేరిట ఉన్న రైస్ మిల్లులో రూ.6 కోట్ల 38 లక్షల 51 వేల విలువైన వడ్లు మాయమై నేటికి సుమారు 50 రోజులు గడిచిపోయింది. చల్లా వెంకటేశ్, సంతోష్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. కానీ రికవరీ విషయంలో సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమార్కులను కాపాడుతున్నదెవరు..?

సీఎంఆర్ బియ్యం పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లూటీ చేసిన రూ. 6.38 కోట్లాది ప్రజాధనాన్ని రికవరీ చేసే విషయంలో పైలును ముందుకు కదలనీయకుండా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పెద్దలు కొందరు అడ్డుపడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో సుమారు 50 రోజులు గడుస్తున్నా రికవరీలో పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రూ.6.38 కోట్ల భారీ కుంభకోణంలో ఎంత మంది లాభం పొందారు? ఆర్థిక ప్రయోజనాలు పొందారా? లేదా? ఎంతవరకు తిరిగి చెల్లిస్తున్నారనే అంశాలపై సంబంధిత శాఖ దృష్టి సారించడం లేదన్న విమర్శ వినిపిస్తున్నాయి. చల్లా వెంకటేశ్, సంతోష్ కుమార్ అయినా అక్రమార్కులను కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొందరు ముఖ్య నేతలే కాపాడుతున్నట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో రికవరీ జరగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రికవరీ చేస్తే ఎంత చెల్లించి ఉంటారు? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విచారణ పేరిట కాలయాపన..!

సీఎంఆర్ బియ్యం భారీ కుంభకోణానికి పాల్పడిన నిందితులపై తూతూ మంత్రంగా క్రిమినల్ కేసు నమోదు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో కొందరికి వాటాలు చేరాయన్న విమర్శలు అప్పట్లో గుప్పుమంటున్నాయి. అందుకే రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలకు దారి తీసింది. వెంటనే సంబంధిత అధికారులు రికవరీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

త్వరలో విచారణ చేస్తాం..!

సీఎంఆర్ బియ్యం కుంభకోణం విచారణ ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది. త్వరలో విచారణ చేపడుతాం. బాధ్యుల నుంచి అందుకు సంబంధించిన మొత్తం రికవరీ చేస్తాం.

- బాలకృష్ణారెడ్డి, తాండూరు డీఎస్పీ

Next Story