బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు.. తెలంగాణకు గేమ్‌ ఛేంజర్‌

by Taduka Kalyani |

ప్రతిపాదించిన మూడు బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌ ఛేంజర్‌ గా మారనునున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడి అభిప్రాయపడ్డారు.

బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు.. తెలంగాణకు గేమ్‌ ఛేంజర్‌
X

దిశ, రంగారెడ్డి బ్యూరో ః ప్రతిపాదించిన మూడు బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌ ఛేంజర్‌ గా మారనునున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడి అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో రూ.87 కోట్ల విలువైన సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సిఆర్‌ఎఫ్‌) రోడ్ల పనులకు రాష్ర్ట రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణకు మూడు హైస్పీడ్‌ రైలు కారిడార్లు ప్రతిపాదించబడినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌-పూణే, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై మార్గాల్లో బుల్లెట్‌ ట్రైన్ల ఏర్పాటుకు ప్రాథమిక అంచనా వ్యయం సుమారు రూ.5 లక్షల కోట్లు కాగా, భూసేకరణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది రూ.10 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైల్‌ కారిడార్లకు సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నాయని, సర్వే, డీపీఆర్‌ పూర్తైన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. అలాగే హైదరాబాద్‌ చుట్టుపక్కల మరో రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేసే దిశగా కూడా ఆలోచనలు జరుగుతున్నాయని, ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతంలో భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశం ఉందన్నారు. తిమ్మాపూర్‌ గ్రామానికి వివిధ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో పలు రహదారి నిర్మాణ పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. కొంగర, రావిరాల, శ్రీశైలం రోడ్డు, లాచునూరు, అవరమియగూడెం, జబార్‌ గూడ, ఎలిమినేడు, కప్పాడు, తుర్కగూడెం, చర్లపటేల్‌ గూడెం, ఇబ్రహీంపట్నం రోడ్డు, గుమ్మడవెల్లి, మీర్‌ ఖాన్‌ పేట, కుర్మిద్ద తదితర ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మాదాపూర్‌, బేగంపేట్‌ ప్రాంతాలతో కూడా కనెక్టివిటీ పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

బిల్లులు లేక పనుల్లో జాప్యం వాస్తవమేః మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

గతంలో కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందకపోవడం వల్ల కొన్ని రహదారి పనులు ఆలస్యమైన విషయం వాస్తవమేనని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అంగీకరించారు. ఇకపై అలాంటి పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొంగర, రావిరాల, తిమ్మాపూర్‌, లాచునూరు, అవరమియగూడెం తదితర ప్రాంతాలకు సంబంధించిన అన్ని రహదారి నిర్మాణ పనులను తక్షణమే సమీక్షించి, రాబోయే కొద్ది నెలల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా కందుకూరు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, రాష్ర్ట రోడ్లు-భవనాల శాఖ ఛైర్మన్‌ మల్‌ రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌ రెడ్డి రంగారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Next Story