గాంధీనగర్ పేదలకు రేషన్, పెన్షన్ ఏమయినయ్ ?

by Disha Web Desk 20 |
గాంధీనగర్ పేదలకు రేషన్, పెన్షన్ ఏమయినయ్ ?
X

దిశ, బడంగ్ పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మురికి వాడల ప్రజలు అనారోగ్యానికి గురైతే బడంగ్ పేట్ కార్పొరేషన్ లో కనీసం ప్రభుత్వ దావఖాన లేదని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా కార్పొరేట్ ఆసుపత్రులను పెంచి పోషిస్తూ పేదోడిని బతుకనీయకుండా చేస్తున్నారని, పేదోడి ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. రెండోరోజు మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్, శ్రీనిలయం నుంచి సీతామెడోస్ వరకు అందెల శ్రీరాములు, కార్పొరేటర్లు, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికీ పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ వార్డ్ సప్తగిరి కాలనీలో ఆయన మొక్కలు నాటారు. గాంధీనగర్ లో నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయని, అక్కడి నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ ప్రశ్నించారు ? పేదలు కట్టుకునే ఇంటి నిర్మాణాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఎటు పోయిందని విమర్శించారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలే గాంధీనగర్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఏళ్లు గడుస్తున్నా కొత్త రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేయటం లేదని విమర్శించారు.

నాటి సర్పంచి నడికుడి యాదగిరి హయాంలో చేసిన అభివృద్ధి తప్పా, నేటికీ దశాబ్దాలు గడిచిన రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్లు రామిడి మాధూరి వీరకర్ణారెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, దడిగె శంకర్, అమితా శ్రీశైలం చారి, గౌర రమాదేవి శ్రీనివాస్, అనితా ప్రభాకర్, గుడెపు ఇంద్రసేన, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, సీనియర్ నాయకులు సామ సంజీవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శురకర్ణారెడ్డి, చిత్రం శ్రీను, అనితా మహేందర్, బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాళ్లు మమతా ఆనంద్, లీలా రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story