వరద నీటిలో చిక్కుకున్న లారీ

by Disha Web Desk 20 |
వరద నీటిలో చిక్కుకున్న లారీ
X

దిశ, శంషాబాద్ : వరదనీటిలో లారీ చిక్కుకొనడంతో అందులో ఉన్న ముగ్గురిని ట్రాఫిక్ పోలీసులు కాపాడిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద గోల్కొండ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా చెరువు నుండి వరద నీరంతా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ జంక్షన్ పూర్తిగా నీట మునిగింది. అక్కడ పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసి వేశారు.

అయినా పట్టించుకోకుండా మంగళవారం అర్థరాత్రి మహబూబ్ నగర్ నుండి చిట్యాల వెళుతున్న ఒక లారీ పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను తప్పించి వెళ్లడంతో లారీ వరద నీటిలో చిక్కుకుంది. అందులో ఉన్న డ్రైవరు మధు, ఇద్దరు కూలీలు అనీఫ్, మనోజ్ లు లారీ టాప్ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు పెట్రోల్ మొబైల్ 1 సిబ్బంది ధనరాజ్ గౌడ్, శివ శంకర్, గణేష్ వారిని లారీలో చిక్కుకున్న వారిని తాళ్ల సహాయంతో బయటికి తీసుకువచ్చారు.

శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ వర్షాల కారణంగా వరద నీటి కాలువల వద్ద వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించి వెళ్ళకూడదన్నారు. ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుంటే 100 నెంబర్ కు డయల్ చేయాలని సూచించారు.

Next Story