రైతుకు భరోసా .. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులు జమ

by Ajay Maddhiboyina |

సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు పేర్కొన్నారు.

రైతుకు భరోసా .. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులు జమ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.8284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు పేర్కొన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధుల ప్రక్రియను నేటితో పూర్తవుతుందని మంత్రి ప్రకటించారు. రైతుకు భరోసాకు సీఎం రేవంతన్న ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతుభరోసా ప్రక్రియను పూర్తి చేసి, రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. జూన్ 16 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రెండు ఎకరాల వరకు రూ.2349.83 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు రూ.3901.73 కోట్లు, మూడో రోజు 4 ఎకరాల వరకు రూ.5215.26 కోట్లు, నాలుగో రోజు 5 ఎకరాల వరకు రూ.6404.70 ఎకరాలు, ఐదో రోజు 7 ఎకరాల వరకు రూ.7310.59 కోట్లు, ఆరో రోజు 9 ఎకరాల వరకు రూ.7770.83 కోట్లు, ఏడో రోజు 15 ఎకరాల వరకు రూ.8284.66 కోట్లు విడుదల చేశామన్నారు.

ఇంత తక్కువ రోజుల్లోనే రైతుభరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారి అని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్న కూడా రైతు సంక్షేమంలో ఎలాంటి రాజీ పడకుండా వానాకాలం రైతుభరోసా పథకాన్ని పూర్తిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారని, ఇంతకు ముందు 2 నుండి 4 నెలల సమయం పట్టేదని, కాని రేవంత్ ప్రభుత్వం కేవలం 9 రోజులలోనే పూర్తి చేసిందని రైతులు హర్హాతిరేకం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంతకు ముందు రైతు రుణమాఫి కూడా చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోగా పూర్తి చేశామని మంత్రి గుర్తు చేశారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా సన్నలకు మద్ధతు ధరపై రూ.500 బోనస్ ప్రకటించామని, దీని ద్వారా అదనంగా రూ.2 వేల కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్న, కొనకపోయినా... మార్క్ ఫెడ్ ద్వారా పండిన ప్రతి పంటను తమ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.

ఇది ఇందిరమ్మ రాజ్యం అని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యమని మరోసారి మా ప్రభుత్వం రుజువు చేసిందని మంత్రి అన్నారు. రైతు భరోసా ద్వారా అందుకున్న నిధులను రైతులు పంట పెట్టుబడులకు వాడుకొని, మంచి పంటలు పండించుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని, కానీ ఇవేమి కనబడని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా మా ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని గ్రహించి దురుద్ధేశంతో చేసే విమర్శలు మానుకోవాలని, రైతులకు మేలు చేసే ఆలోచనలతో ముందుకురావాలని హితవు పలికారు. రైతుల సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యమని, అందుకనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వ వైఖరి చిత్తశుద్ధి ఏ మాత్రం మారదని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతుభరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే పూర్తి చేసిన సందర్భంగా, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతుపండగ కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు రైతులను ఉద్ధేశించి సీఎం మాట్లాడుతారని మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి వారి వారి నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రైతుపండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Next Story