తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తాం: రాహుల్ గాంధీ

by Disha Web Desk 2 |
తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తాం: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సహా ఇతర అనేక రాష్ట్రాల్లోనూ బీజేపీని మట్టికరిపిస్తామని చెప్పారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదని, యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ ప్రసంగించారు.‘బీజేపీని తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు. తుడిచిపెట్టేశాం’ అని రాహుల్‌ అన్నారు. కర్ణాటకలో బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందన్నారు. వారి వెంట మొత్తం మీడియా ఉంది, మా దగ్గర కంటే వారి దగ్గర 10 రెట్లు ఎక్కువ డబ్బు ఉంది. వాళ్ల ప్రభుత్వం ఉంది. ఏజెన్సీలు ఉన్నాయి. ఇలా అన్నీ ఉన్నాయి. కానీ చివరికి ఆ పార్టీని కాంగ్రెస్‌ తుడిచిపెట్టేసింది అని రాహుల్ ఎద్దేవా చేశారు.

తెలంగాణలోనూ అదే జరగబోతోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని గుర్తించడం కష్టమని వ్యాఖ్యానించారు. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ కనిపించకుండా పోతుందని విమర్శలు గుప్పించారు. బీజేపీ చేస్తున్న విద్వేష రాజకీయాలతో ముందుకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే అందుకు కారణమన్నారు. 2024 ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తామని... అందుకోసం ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఓవైపు బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్‌ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మద్దతుదారులు, పార్టీ నేతలు, ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కూడా హాజరయ్యారు.

Read more:

ఈ పదేళ్లలో కేసీఆర్ చెప్పిన 10 పెద్ద జోకులు ఇవే.. బండి సంజయ్ సైటైర్లు


Next Story