మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఎవరినీ వదలం.. మేమేంటో చూపిస్తాం: ఆర్.కృష్ణయ్య సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-09 11:00:31  IST  )

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు(Telangana High Court) స్టే విధించింది.

మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఎవరినీ వదలం.. మేమేంటో చూపిస్తాం: ఆర్.కృష్ణయ్య సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు(Telangana High Court) స్టే విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తోపాటు నోటిఫికేషన్‌పైనా స్టే విధించింది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తాజాగా తీర్పుపై బీసీ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందన చూసి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో పాటు బంద్‌కు పిలుపునిస్తామని సంచలన ప్రకటన చేశారు. బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు.. కావాలనే కుట్రలు చేసి అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఎవరినీ వదలం.. బీసీల సత్తా ఏంటో చూపిస్తాం అని అన్నారు.

Next Story