‘కంచె’ రచనలతోనే ప్రజా చైతన్యం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by Disha Web Desk 1 |
‘కంచె’ రచనలతోనే ప్రజా చైతన్యం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్ సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తెచ్చారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రశంసించారు. ఇవాళ కర్ణాటకలోని కనకపీఠం ఆధ్వర్యంలో కంచె ఐలయ్యకు 'మా జాతి సూర్యుడు' అవార్డును సీఎం సిద్ధరామయ్య బహుకరించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఐలయ్య మా జాతి సూర్యుడు అని అభివర్ణించారు. ఈ కులాధిపత్య అసమాన సమాజంలో ఐలయ్య లాంటి వ్యక్తులు, వారి రచనల అవసరం చాలా ఉందని తెలిపారు. బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా వై అయామ్ నాట్ ఏ హిందూ, బఫెల్లో నేషనలిజం లాంటి అనేక రచనలు చేశారని పేర్కొన్నారు.

కులాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా, ఆధునిక శూద్ర సమాజ పురోగతికి, సమసమాజ స్థాపనకు ఎంతగానో దోహదపడేలా ఐలయ్య సిద్ధాంత రచన చేయడాన్ని కనక పీఠం కొనియాడింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని మారుమూల పల్లె పాపయ్యపేటలో, కురుమ కులంలో జన్మించిన ఐలయ్య యావత్ భారతదేశం గర్వించే స్థాయికి ఎదగడం కురుమ కులానికే గర్వకారణమని పీఠం ప్రశంసించింది. అందుకే ఐలయ్యకు యావత్ కురుమ సమాజం తరపున 'మా జాతి సూర్యుడు' అవార్డును అందజేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కనక పీఠం పీఠాధిపతి సిద్ధారామానంద మహా స్వామి తలపాగా తొడిగి రూ.50 వేల నగదును కంచె ఐలయ్యకు అందజేశారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కంచె ఐలయ్య మాట్లాడుతూ.. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని దళిత బహుజనుల పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించాలని, అగ్ర కులాల పిల్లల చదువులకు బహుజనుల పిల్లలు ఏ మాత్రం తీసిపోకుండా చూడాలని సిద్ధరామయ్యని కోరారు. జాతి సూర్యుడిగా అవార్డు ఇచ్చిన కనకపీఠంకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సభలో కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి భగవంత్ ఖుభా, కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బైరతి సురేష్, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ విప్లవ్, దాసరి శ్రీనివాస్, ఉస్మానియా విద్యార్థులు కొంగల పాండు, గురునాధ్, సురేందర్, దయ్యాల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story