తెలుగు భక్తులకు అక్కడ ప్రత్యేక వసతులు కల్పించండి.. యుపీ సీఎంను కోరిన ఎంపీ లక్ష్మణ్​

by Ramesh Goud |   (  Updated:2025-05-07 16:12:55  IST  )

తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్య రామమందిరం, కాశీ విశ్వనాథ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక వసతుల కల్పించాలని యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ​కోరారు.

తెలుగు భక్తులకు అక్కడ ప్రత్యేక వసతులు కల్పించండి.. యుపీ సీఎంను కోరిన ఎంపీ లక్ష్మణ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్య రామమందిరం, కాశీ విశ్వనాథ ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక వసతుల కల్పించాలని యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్​ కోరారు. బుధవారం ఆయనను కలిసి వసతుల ఏర్పాట్లపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివరిస్తూ.. భక్తులకు తక్కువ ధరలకు సురక్షితమైన వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటివి అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్ల అవసరం ఉందన్నారు. కాశీ, అయోధ్యలో వసతి, భోజన, పార్కింగ్, శుచి గృహాల వంటి నిర్మాణానికి అవసరమైన భూమి కనీసం 2వేల చదరపు గజాల నుండి 1 ఎకరం వరకు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.

భూమిని కేటాయించిన తర్వాత, అవసరమైన వసతుల నిర్మాణాన్ని ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా కానీ ఇతర సంబంధిత నిధుల సహాయంతో చేపడతానని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉండటంతో, వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లుతున్నట్లు చెప్పారు. ఈ విషయం పట్ల యోగి అదిత్యనాథ్​సానుకూలంగా స్పందించడం చాలా ఆనందంగా ఉంది. దీంతో భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే కాకుండా, తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుంది. భవిష్యత్‌లో తెలుగు భక్తుల యాత్ర మరింత సౌకర్యవంతంగా, గౌరవప్రదంగా ఉండేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

Next Story