రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీలో ప్రొటోకాల్ కలకలం

by Disha Web Desk 4 |
రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీలో ప్రొటోకాల్ కలకలం
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం అధికారికంగా నిర్వహించిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించని ఘటన కలకలం రేపింది. అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వికారాబాద్ మున్సిపల్ ప్రథమ పౌరురాలు, చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తో పాటు, మండల ఎంపీపీ చంద్రకళ, చివరికి మైనార్టీ నాయకురాలు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, స్థానిక కౌన్సిలర్ పైమీద బేగం నలుగురి ఫోటోలు లేకపోవడంతో ఎమ్మార్వో వహేదా కాతూమ్ తీరుపై చైర్ పర్సన్ మంజుల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ రాగానే నలుగురు మహిళా ప్రజా ప్రతినిధులు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మహిళా ప్రజా ప్రతినిధులను అవమానించేలా ఫ్లెక్సీలు వేయడం ఏంటని, ప్రోటోకాల్ పాటించనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని, అంత ధైర్యం మాకు ఉందని, అధికారులు మీ పరిధిలో ఉండాలని ఎమ్మార్వోను హెచ్చరించారు. ఎమ్మార్వో తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చైర్ పర్సన్ మంజుల రమేష్ తెలిపారు.

ఫ్లెక్సీ తీసేసి కార్యక్రమం కొనసాగింపు..

ప్రోటోకాల్ ఇష్యూతో గొడవ జరగడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు ఫ్లెక్సీ తీసివేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం చివరి వరకు ఒకే పార్టీలో రెండు వర్గాలుగా చర్చలు నడిచాయి. మైక్ తీసుకున్న చైర్ పర్సన్ ప్రశ్నించే సమయం వస్తే కచ్చితంగా ప్రశ్నిస్తామని ఎవరికీ భయపడేది లేదని అన్నారు. ఇదిలా ఉంటే కార్యక్రమం చివర్లో ప్రజాప్రతినిధులు అందరు కలిసి రంజాన్ గిఫ్టులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఎమ్మెల్యే ఆనంద్ ఒక గిఫ్ట్ పంపిణీ చేయగా, చైర్ పర్సన్ ఇతర మహిళా ప్రజా ప్రతినిధులు మరో గిఫ్ట్ పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని గందరగోళానికి గురి చేశారు. ఈ కార్యక్రమంతో వికారాబాద్ బీఆర్ఎస్‌లో వర్గ పోరు మరింత తారస్థాయికి చేరిందని చర్చ నడుస్తుంది. చైర్ పర్సన్ మంజుల రమేష్ ఎప్పుడు లేని విధంగా ఆగ్రహానికి గురి కావడంతో, చివరికి ఎమ్మెల్యే ఆనంద్ సైతం మౌనం పాటించారు. ఇలాంటివి మరోసారి రిపీట్ అయితే బాగుండదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మార్వోను హెచ్చరించారు.

Next Story

Most Viewed