ప్రియాంకను ఏ హోదాతో పిలుస్తారు? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత రియాక్షన్

by Disha Web Desk 13 |
ప్రియాంకను ఏ హోదాతో పిలుస్తారు?  సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కవిత రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తే నిరసన తెలియజేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిన్న ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలోనే మహిళకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై శనివారం కవిత రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నాయకులను ఎలా పిలుస్తారని? ప్రియాంక గాంధీని ఏ హోదాతో పిలుస్తారో చెప్పాలన్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన మీటింగ్ కు ప్రభుత్వ సొమ్ము ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.

పూలే విగ్రహం కోసం గత ప్రభుత్వంలో తాను అడగలేదని, ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను. అసెంబ్లీ ఆవరణంలో పూలే విగ్రహం పెడతారా లేదా అని చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీ జనగణన చేపడతామని చెప్పారని కానీ బీసీ జనగణనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదన్నారు. బడ్జెట్ లో బీసీలకు 20 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తామని హామీ ఇచ్చారని వీటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం బడ్జెట్ పెట్టి రెండు రోజులు గడుస్తున్నా రాష్ట్రానికి కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు నోరుమెదపడం లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందనడానికి ఇదే నిదర్శనం అన్నారు.

పొన్నం ప్రభాకర్ కు ఓనమాలు నేర్పే పెద్దదాన్ని తాను కాదన్నారు. రేవంత్ రెడ్డి నోటి నుంచి ఇప్పటి వరకు జై తెలంగాణ అనే మాట రావడం లేదని అమరవీరులకు నివాళులు అర్పించడానికి తీరిక లేని సీఎం.. ఓ దినపత్రిక సంస్థ అధినేత ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి హోదాలో వెయిటింగ్ చేయడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడమే అవుతుందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను కుటుంబ పాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నిక్లలో 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. సీఎం సోదరులు జిల్లా రివ్యూల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు.


Next Story