ఉత్కంఠ రేపుతున్న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన!

by Disha Web Desk 2 |
ఉత్కంఠ రేపుతున్న ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 8వ తేదీన ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రూ. 11 వేల 355 కోట్ల విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. అయితే ఈ మీటింగ్ లో మోడీ స్పీచ్ పై ఆసక్తి ఏర్పడుతోంది. సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నేరుగా విమర్శలు చేస్తున్న తరుణంలో మోడీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. గత పర్యటనలో బేగంపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రధాని రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయం వేడెక్కింది. లిక్కర్ స్కాంలో కవిత పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాలు ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేసీఆర్ వంటి నేతలు కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నింటికి మించి ఈ ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామంటే తామే అని బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. మోడీని ఇరుకున పెట్టేలా రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ రియాక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టూర్‌లో ప్రధాని తన స్పీచ్‌లో కేసీఆర్, కాంగ్రెస్ విషయంలో డోస్ పెంచుతారా అనేదానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మోడీ మాత్రం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాము అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని తద్వారా పేదలకు అందాల్సిన ఫలాలు అందడం లేదనే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారనేది బలంగా వినిపిస్తోంది.


Next Story

Most Viewed